ఇస్లామాబాద్: రెండు రోజుల క్రితం పెషావర్ నగరంలోని మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 100 మందికిపైగా మరణించిన ఘటనపై పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్.. ఆ దేశ నేషనల్ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. మసీదు సెంట్రల్ హాల్లో ప్రార్ధనలు జరుగుతుండగా తాలిబన్లు ఆత్మాహుతి దాడికి పాల్పడటాన్ని ఆయన హేయమైన చర్యగా పేర్కొన్నారు.
మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా ప్రార్థనల్లో మునిగి ఉన్నవాళ్లను హతమార్చిన ఘటనలు భారత్, ఇజ్రాయెల్ లాంటి దేశాల్లో కూడా ఎన్నడూ చోటుచేసుకోలేదని, కానీ ఇప్పుడు పాకిస్థాన్లో అలాంటి ఘటన జరిగిందని వ్యాఖ్యానించారు. మసీదులో ఆత్మాహుతి దాడిపై రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇవాళ పాక్ జాతీయ అసెంబ్లీలో ప్రకటన చేశారు.
మనం ఇంటిని చక్కదిద్దుకోవాలి
ఉగ్రవాదంపై పోరాటంలో ఐకమత్యం కీలకమని ఖ్వాజా ఆసిఫ్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్ ఇంటిని చక్కదిద్దుకోవడం చాలా కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా 2010 నుంచి 2017 మధ్య పాకిస్థాన్లో జరిగిన ఉగ్రవాద దాడుల గురించి ఆయన ప్రస్తావించారు. ఆ ఏడేండ్ల వ్యవధిలో.. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ హయాంలో మొదలైన ఉగ్రదాడులకు పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ పార్టీ తన గత ప్రభుత్వ హయాంలో ముగింపు పలికిందని చెప్పారు.
ఉగ్రవాదాన్ని అంతం చేయడంపై ఇదే నేషనల్ అసెంబ్లీలో చాలాసార్లు చర్చలు జరిగాయని, ఎందరో ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడించారని, కానీ ఉగ్రవాదాన్ని అంతం చేయడంపై ఒక అంతిమ నిర్ణయానికి మాత్రం రాలేకపోయామని పాక్ రక్షణ మంత్రి వ్యాఖ్యానించారు. ఈ విషయంలో సాధ్యమైనంత త్వరలో ఒక కంక్లూజన్ అవసరమన్నారు.
ఉగ్రవాదానికి నిరుద్యోగమూ ఊతమే
ఆఫ్ఘానిస్థాన్ నుంచి జనం భారీగా వలసలు వచ్చి పాకిస్థాన్లో నివాసం ఉంటున్నారని, దాంతో పాకిస్థాన్లో నిరుద్యోగం పెరిగిపోతున్నదని, యువత ఉపాధి లేక ఉగ్రవాదం వైపు మొగ్గుచూపుతున్నదని పాక్ మంత్రి ఖ్వాజా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సమస్యకు కూడా పరిష్కారం మార్గం చూడాల్సిన అవసరం ఉందన్నారు. ‘నేను ఎక్కువ మాట్లాడను కానీ, ఒక్క మాటలో చెప్పాలంటే మొదట ఉగ్రవాదానికి బీజం వేసింది మనమే’ అని ఖ్వాజా వ్యాఖ్యానించారు.
రష్యా ఆఫ్ఘానిస్థాన్పై దండయాత్ర చేసినప్పుడు.. పాకిస్థాన్ అద్దె ప్రాతిపదికన అమెరికాకు తన సేవలు అందించిందని, అప్పుడు జనరల్ జియా పాకిస్థాన్ పాలకుడిగా ఉన్నాడని పాక్ రక్షణ మంత్రి వ్యాఖ్యానించాడు. అమెరికాతో జరిగిన ఆ సైనిక సహకార ఒప్పందం.. రష్యా ఓటమిపాలై అమెరికా వాషింగ్టన్లో సంబరాలు చేసుకునే వరకు దాదాపు తొమ్మిదేండ్లపాటు కొనసాగిందని ఖ్వాజా గుర్తుచేశారు.