బ్యాంకాక్: ఒక చోట కారును ఆపిన వ్యక్తి అనంతరం భార్యను తిరిగి ఎక్కించుకోవడం మరిచి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. భార్య కారులో నిద్ర పోతున్నదని భావించి చాలా దూరం ప్రయాణించాడు. భార్య పోలీసుల సహాయం కోరడంతో చివరకు వారు అతడ్ని అలెర్ట్ చేశారు. దీంతో భార్య కోసం సుమారు 160 కిలోమీటర్ల దూరం వెనక్కి ప్రయాణించి ఆమె వద్దకు చేరుకున్నాడు. విస్తూపోయే ఈ సంఘటన థాయిలాండ్లో జరిగింది. భార్యాభర్తలైన 55 ఏళ్ల బూన్తోమ్ చైమూన్, 49 ఏళ్ల అమ్నుయ్ చైమూన్కు 27 ఏళ్ల కిందట వివాహమైంది. ఇటీవల రోడ్ ట్రిప్ కోసం వారిద్దరూ కారులో బయలుదేరారు. తెల్లవారుజామున 3 గంటలకు కారును రోడ్డు పక్కగా భర్త ఆపాడు. మూత్ర విసర్జన కోసం ఒక పక్కకు వెళ్లాడు. వెనుక సీటులో కూర్చొన్న భార్య కూడా కారు దిగి సమీపంలోని చెట్లలోకి వెళ్లింది.
కాగా, భార్య కారు దిగిన విషయాన్ని భర్త గమనించలేదు. కారులోని వెనుక సీటులో ఆమె నిద్ర పోతున్నదని అతడు భావించాడు. దీంతో కారును డ్రైవ్ చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే రోడ్డు వద్దకు వచ్చిన భార్య, భర్తతోపాటు కారు కూడా కనిపించకపోవడంతో ఆందోళన చెందింది. మొబైల్ ఫోన్ కూడా కారులో ఉండిపోవడంతో ఏం చేయాలో ఆమెకు తెలియలేదు. దీంతో రెండు గంటలపాటు నడిచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్కు చేరుకుంది. జరిగిన విషయం పోలీసులకు చెప్పింది. భర్త మొబైల్ నంబర్ గుర్తు లేకపోవడంతో కారులో వదిలిన తన మొబైల్ ఫోన్కు పలుసార్లు ఫోన్ చేసింది. అయితే ఆ మొబైల్ వెనక సీటులో ఉండటంతో భర్తకు వినిపించలేదు.
మరోవైపు పోలీసులు చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత చివరకు ఉదయం 8 గంటల సమయంలో కారు డ్రైవ్ చేస్తున్న భర్తను కాంటాక్ట్ చేశారు. అయితే అతడు అప్పటికే 150 కిలోమీటర్లకుపైగా ప్రయాణించాడు. భార్యను వదిలేసిన సంగతి తెలుసుకుని తిరిగి వెనక్కి ప్రయాణించాడు. భార్య వద్దకు చేరుకున్న తర్వాత జరిగిన పొరపాటుకు తనను క్షమించమని పలుమార్లు ప్రాధేయపడ్డాడు. అయితే భార్య కూడా భర్తపై ఆగ్రహం చెందలేదు. ఏమీ మాట్లాడకుండా ఉండిపోయింది. ఇది చూసి పోలీసులు ఒకింత ఆశ్చర్యపోయారు. వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం వల్ల భర్త పొరపాటును భార్య అర్థం చేసుకుని ఉంటుందని పోలీసులు భావించారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.