కైరో: మనిషి ఆకాశానికి నిచ్చెన వేస్తున్నా.. భూమిపై కడుపు నింపుకోవడానికి పట్టెడు అన్నం దొరకని దుస్థితి ఇంకా ఉండటం విషాదం. పేదరిక వ్యతిరేక సంస్థ ఆక్స్ఫామ్ తాజాగా వెల్లడించిన నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి 11 మంది ఆకలితో అలమటిస్తూ కన్నుమూస్తున్నారు. గత ఏడాది కాలంగా కరువు పరిస్థితులను ఎదుర్కొంటూ ఇలా ఆకలి చావుల బారిన పడుతున్న వారి సంఖ్య ఆరు రెట్లు పెరగడం గమనార్హం. ది హంగర్ వైరస్ మల్టిప్లైస్ పేరుతో ఆక్స్ఫామ్ ఈ రిపోర్ట్ను రూపొందించింది.
కొవిడ్ను మించిన మరణాలు
పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మరణాలను మించిన ఈ ఆకలి చావులు నమోదవుతున్నాయి. కరోనా కారణంగా నిమిషానికి ఏడుగురు చనిపోతుంటే.. ఆకలి కారణంగా 11 మంది చనిపోతున్నట్లు ఆక్స్ఫామ్ వెల్లడించింది. ఈ రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 15.5 కోట్ల మంది ఆహార భద్రత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. గతేడాది కంటే ఈ సంఖ్య రెండు కోట్లు పెరిగింది. వీళ్లలో మూడింట రెండు వంతుల మంది తమ దేశాల్లో మిలిటరీ సంఘర్షణ కారణంగా ఆకలి సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఆక్స్ఫామ్ అమెరికా ప్రెసిడెంట్, సీఈవో అబ్బీ మ్యాక్స్మ్యాన్ వెల్లడించారు.
ఇటు కొవిడ్.. అటు వాతావరణ సమస్యలు
కొవిడ్ కారణంగా ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలి సమాజంలో ఏర్పడిన సంఘర్షణలు, వాతావరణ సంక్షోభం మరింత ముదరడం వల్ల ప్రపంచంలో సుమారు 5,20,000 మంది ఆకలి చావులకు సిద్ధంగా ఉన్నారని మ్యాక్స్మ్యాన్ చెప్పారు. మరో విషాదం ఏమిటంటే.. ఈ మహమ్మారి కాలంలోనూ దేశాలు మిలిటరీపై వెచ్చించిన మొత్తం 5100 కోట్ల డాలర్లు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఆకలి చావులను ఆపడానికి ఐక్యరాజ్య సమితికి అవసరమైన మొత్తం కంటే ఇది ఆరు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.
ఆఫ్ఘనిస్థాన్, ఇథియోపియా, సౌత్ సూడాన్, సిరియా, యెమెన్లాంటి దేశాలు ఆకలి చావులకు కేరాఫ్గా మారుతున్నాయి. ఈ ఆకలి చావులను ఆపడానికి ప్రభుత్వాలు తమ దేశాల్లోని ఘర్షణలను ఆపాలని ఆక్స్ఫామ్ కోరింది. ఆకలిపై పోరాటానికి ఐక్యరాజ్యసమితికి అవసరమైన నిధులను దేశాలు అందించాలని కూడా అభ్యర్థించింది.