భూతాపం..! అంటే భూమి ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటం..! దీన్నే ఇంగ్లిష్లో గ్లోబల్ వార్మింగ్ (global warming) అంటారు..! ఈ గ్లోబల్ వార్మింగ్కు, మెదడు పరిమాణానికి సంబంధం ఉందా..? భూతాపం ఎక్కువగా ఉంటే మనిషి మెదడు నెమ్మదిగా వృద్ధి చెందుతుందా..? ఈ భూమిపై మానవుడి ఆవిర్భావం జరిగినప్పుడు భూమి చల్లగా ఉండేదా..? అప్పుడు మనిషి మెదడు వృద్ధి వేగంగా జరిగిందా..? రానురాను భూతాపం పెరుగుతుంటే మానవ మెదడు వృద్ధిలో వేగం, మెదడు పరిమాణం తగ్గుతున్నదా..? భవిష్యత్తులో భూతాపం ఇంకా పెరిగితే మానవ మెదడు పరిమాణం మరింత కుచించుకుపోనుందా..? అవును..! అదే జరుగబోతుంది. ఇటీవల జరిగిన ఓ అధ్యయనం ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం ఇస్తున్నది..! మరి ఆ అధ్యయనం గురించి వివరంగా తెలుసుకుందామా..?
పురాతన కాలం నాటి మానవుల మెదడు పరిమాణంతో పోల్చి చూస్తే ఇప్పటి మానవుల మెదడు పరిమాణం కొంచెం పెద్దదిగా ఉన్నదని మానవ పరిణామ చరిత్రలో చేరిన ఓ నూతన అధ్యాయం చెబుతున్నది. ఇంటర్నెట్ లాంటి సాంకేతికతల ఆవిష్కరణ ద్వారా ఇప్పుడు మానవ మెదడు స్మార్ట్ అయ్యిందని కాలిఫోర్నియా నేషనల్ హిస్టరీ మ్యూజియంకు చెందిన పరిశోధకురాలు జెఫ్ మోర్గాన్ స్టిబెల్ చెప్పారు. గ్లోబల్ వార్మింగ్కు, మానవ మెదడు వృద్ధికి మధ్య సంబంధం గురించి వారు చేసిన పరిశోధన ఫలితాలు ‘బ్రెయిన్, బిహేవియర్, ఎవల్యూషన్’ అనే పరిశోధనా పత్రంలో ప్రచురితమయ్యాయి.
మెదడు పరిమాణం మనిషి తెలివితేటలను పెద్దగా ప్రభావితం చేయదని, కానీ ఆ మనిషి శరీర విధులపై బాగా ప్రభావం చూపుతుందని తాజా పరిశోధనలో తేలింది. ప్రస్తుత మానవుల మెదడు పరిమాణంలో కొంచెం తగ్గుదల కూడా అంతుబట్టని స్థాయిలో వారి శరీర ధర్మాలను ప్రభావితం చేస్తున్నదని పరిశోధనా పత్రంలో స్టిబెల్ తన వాదనను ప్రస్తావించారు. పురాతన మానవుల మెదడు పరిమాణాన్ని అంచనా వేయడానికి వారి పుర్రెల పరిమాణాలను చూస్తారు. స్టిబెల్ కూడా అదేవిధంగా 298 మానవ పుర్రె ఎముకల నుంచి 373 కొలతలకు సంబంధించిన డాటాను సేకరించారు. ఆమె పరిశీలించిన పుర్రెలలో కొన్ని 50,000 సంవత్సరాల క్రితం నాటివి కూడా ఉన్నాయి.
హోలోసీన్ కాలంలో తగ్గిన పుర్రె సైజు
పుర్రెలు కచ్చితంగా ఏ కాలం నాటివి అనే డేటింగ్ లోపాలను అధిగమించడానికి శిలాజాలను పలు సమూహాలుగా వర్గీకరించడం ఉపయోగపడింది. మానవుడి భూమి కాలుమోపిన కాలం ఆధారంగా నాలుగు సమూహాలుగా విభజించారు. అందులో 100 సంవత్సరాల కిత్రం వరకు ఒక సమూహం, 5,000 సంవత్సరాల క్రితం వరకు ఒక సమూహం, 10,000 సంవత్సరాల క్రితం వరకు ఇంకో సమూహం, 15,000 సంవత్సరాల క్రితం వరకు మరో సమూహంగా విభజించారు. అదృష్టవశాత్తు భూమి చరిత్రలో వివిధ స్థాయిల్లో ఉపరితల ఉష్ణోగ్రతలు ఎలా ఉండేవో మనకు కచ్చితమైన కొలతలు ఉన్నాయి. ఈ కొలతలను ఆధారంగా చేసుకుని మనిషి మెదడు పరిమాణాన్ని పోల్చిచూస్తే వాతావరణం వేడెక్కుతున్నప్పుడు అంటే హోలోసీన్ కాలంలో (సుమారు 11,700 సంవత్సరాల క్రితం నుంచి ప్రస్తుత సమయం వరకు) మన పుర్రె సైజు 10 శాతం తగ్గిపోయింది.
అంటే అంతకుముందు భూతాపం తక్కువగా ఉన్న సమయంలో మన పూర్వీకులు పెద్ద మెదడులను కలిగి ఉన్నారు. అయితే, మెదడు పరిమాణంలో మార్పులు వాతావరణ మార్పులు జరిగిన తర్వాత కొన్ని వేల సంవత్సరాలకు సంభవిస్తున్నట్లు పరిశోధనా పత్రంలో వివరించారు. ఈ అన్వేషణలో తేలిన మరో అంశం ఏమిటంటే మానవ పరిణామం అనేది 17 వేల ఏండ్ల క్రితం నుంచి 5 వేల ఏండ్ల క్రితం వరకు వేగంగా జరిగింది. అదేవిధంగా గ్లోబల్ వార్మింగ్ అనేది మనిషి మెదడు పరిమాణంలో వృద్ధినే కాకుండా, భవిష్యత్తుల్లో మనిషి జ్ఞానంపై కూడా ప్రభావం చూపుతుందని పరిశోధకురాలు స్టిబెల్ భావిస్తున్నారు. ఇక మానవ శరీరధర్మ శాస్త్రంపై వాతావరణ మార్పు ప్రభావం అనేది ప్రత్యేకంగా ఉష్ణోగ్రత మార్పుల ఫలితమా లేదంటే మారుతున్న వాతావరణంలోని ఇతర అంశాల పరోక్ష ప్రభావమా..? అని నిర్ధారించడానికి మరింత పరిశోధన అవసరమని రిసెర్చ్ పేపర్లో పేర్కొన్నారు.