Bangla agitations | బంగ్లాదేశ్లో ఆందోళనలు మిన్నంటాయి. ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చారు. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. తిరిగి ఎన్నికలు జరుపాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ డిమాండ్ చేస్తున్నది. బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికలు 2024 జనవరిలో జరుగనున్నాయి. ఈ విషయాన్ని బంగ్లా ప్రధాని ప్రకటించారు. షేక్ హసీనా 2009 నుంచి బంగ్లాదేశ్ ప్రధానిగా వరుసగా ఐదుసార్లు ఎన్నికయ్యారు.
బంగ్లాదేశ్ రాజధాని ఢాకా ఆందోళనాకారులతో నిండిపోయింది. ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకొచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజల ఆందోళనల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) నేతలు పాల్గొన్నారు. ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. తిరిగి ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్య పద్ధతితో ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని వారు కోరారు. ఢాకాలోని గోలప్బాగ్ మైదాన్లో భారీ బహిరంగ సభ జరిగింది. అంతకుముందు ర్యాలీలో ప్రజలు ‘షేక్ హసీనా ఓట్ చోర్ హై’ అంటూ నినాదాలు చేశారు.
కరెంటు కోతలు, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై బంగ్లాదేశ్లో ప్రతిపక్షాలు చాలా కాలంగా ఆందోళనలు చేస్తున్నాయి. ఇటీవలికాలంలో నిరసనలు మరింత తీవ్రంగా మారాయి. శుక్రవారం నాడు భద్రతా దళాలు బీఎన్పీ ప్రధాన కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లాయి. భద్రతా బలగాలు జరిపిన దాడిలో ఒకరు మృతి చెందారు. దీంతో విపక్షాల్లో ఆగ్రహం పెల్లుబికింది. ప్రధాని రాజీనామా చేయాలన్న డిమాండ్తో వారు ప్రజాందోళనలు చేపట్టారు. శనివారం చేపట్టిన ఆందోళనల్లో దాదాపు 2 లక్షల మంది పాల్గొన్నట్లు బీఎన్పీ నేతలు చెప్తున్నారు.