బీజింగ్, మే 6: వారానికి 30 నిమిషాలు, అంతకంటే ఎక్కువ మొబైల్ ఫోన్లో మాట్లాడటం వల్ల అధిక రక్తపోటు ముప్పు 12 శాతం పెరుగుతుందని చైనా శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. ఇందుకు సంబంధించిన వివరాలు డిజిటల్ హెల్త్ అనే యూరోపియన్ హార్ట్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. వారంలో 5 నిమిషాల కంటే తక్కువ మొబైల్లో మాట్లాడే వారితో పోలిస్తే 30-59 నిమిషాలు మాట్లాడే వారిలో 8 శాతం, 1-3 గంటలు మాట్లాడే వారిలో 13 శాతం, 4-6 గంటలు మాట్లాడే వారిలో 25 శాతం బీపీ పెరిగే ముప్పు ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. జన్యుపరంగా ముప్పు ఉన్న వారు వారానికి 30 నిమిషాల కంటే ఎక్కువ మొబైల్ మాట్లాడటం వల్ల హైబీపీ ప్రమాదం 33 శాతం ఎక్కువ ఉంటుందని తెలిపారు. మొబైల్ ఫోన్లు తక్కువ స్థాయి రేడియో ఫ్రీక్వెన్సీ శక్తిని విడుదల చేస్తాయని, దీనికి, రక్తపోటు పెరగడానికి ముడిపడి ఉందని తెలిపారు.