Tension on border | పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. తాలిబాన్ ప్రభుత్వం దేశ సరిహద్దులో భారీగా సాయుధ బలగాలను మోహరించింది. ఆదివారం నాటి కాల్పుల్లో ఆరుగురు పాకిస్థానీయులు చనిపోవడం ఈ ఉద్రిక్తతకు కారణంగా పేర్కొంటున్నారు. ఎలాంటి రెచ్చగొట్టే పనులు చేయకున్నా తాలిబాన్లు కాల్పులు జరిపారని పాకిస్థాన్ సైన్యం, ప్రభుత్వం ఆరోపిస్తున్నది. ఈ ఘటనలో ఆరుగురు పౌరులతోపాటు ఒక సైనికుడు చనిపోయాడు. ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఒకరు మరణించారు.
మరోవైపు పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ భద్రతా కమిటీ సమావేశానికి పిలుపునిచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చమన్ సరిహద్దులో ఏది జరిగినా తప్పుగా భావించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. పాక్ సైన్యం, పౌరులపై తాలిబాన్లు అనవసరంగా కాల్పులు జరిపారని ఆరోపించారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా తాలిబాన్ ప్రభుత్వం చూడాలని ఆయన సూచించారు. ఇలాంటి ఘటనలను చూస్తూ ఊరుకునేది లేదని కాస్తా ఘాటుగానే స్పందించారు.
మీడియా కథనాల ప్రకారం, ఆదివారం నాటి భారీ కాల్పుల నేపథ్యంలో చమన్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. ఈ సరిహద్దు ప్రాంతం చాలా కాలం పాటు మూసివేసి ఉంచారు. ఇప్పుడు ఆఫ్ఘన్ తాలిబన్లు ఈ ప్రాంతంలో ఎదురుదాడికి సన్నాహాలు ప్రారంభించారు. సరిహద్దులో సాయుధ వాహనాలు, ఫిరంగులు, ఇతర భారీ ఆయుధాలను తాలిబాన్ ప్రభుత్వం మోహరించింది. ఎలాంటి ప్రతిచర్యనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తన చేష్టల ద్వారా తాలిబాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇలాఉండగా, ఆదివారం నాటి కాల్పుల్లో ఆరుగురు చనిపోవడంపై తాలిబాన్లు ఇంతవరకు స్పందించలేదు. అయితే, సరిహద్దులో కొత్త చెక్ పాయింట్ నిర్మాణాన్ని పాకిస్థాన్ అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత పెరిగింది. ఈ నేపథ్యంలో పాక్ వైపు పెద్ద మొత్తంలో నష్టం జరిగినట్లుగా తెలుస్తున్నది.