సిడ్నీ: ఆస్ట్రేలియాలోని సిడ్నీని ఆకస్మిక వరదలు వణికిస్తున్నాయి. తూర్పు తీరంలో రికార్డు స్థాయి వర్షపాతంతో వరదలు ముంచెత్తాయి. దీంతో సిడ్నీ పరిసర ప్రాంతాల్లో వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. న్యూ సౌత్వేల్స్ రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు రానున్నట్లు ఒక రోజు ముందుగానే అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు నీట మునుగుతున్నాయి. ఈ వరదలు ఓ విపత్తు అని స్థానిక క్లబ్ టారీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పాల్ అలెన్ అన్నారు. స్థానికంగా కొందరు ఈ వరదల్లో తమ సర్వస్వాన్నీ కోల్పోయారని ఆయన చెప్పారు. వచ్చే గురువారం వరకూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సిడ్నీ ప్రజలకు ప్రధాన తాగునీటి వనరు అయిన వారగంబా డ్యామ్ 30 ఏళ్ల తర్వాత పూర్తిగా నిండి ఓవర్ఫ్లో అవుతోంది. ఇప్పటికే ఎమర్జెన్సీ సర్వీసులకు సాయం కావలంటూ వెయ్యికి పైగా కాల్స్ వచ్చాయి. వర్షాలు, వరదల కారణంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభాన్ని మరింత ఆలస్యం చేస్తోంది.