వాషింగ్టన్, నవంబర్ 16: చిన్నా, పెద్ద తేడాలేకుండా అందరూ మొబైల్ చేతిలో ఉంటే తప్పనిసరిగా హెడ్ఫోన్స్, ఇయర్బడ్స్ వాడుతున్నారు. పెద్దగా సౌండ్ పెట్టుకొని గంటల కొద్దీ వాటితో గడుపుతున్నారు. పబ్బులు, శుభకార్యాలు.. ఇలా ఏ చిన్న వేదిక దొరికినా లౌడ్ మ్యూజిక్ ఉండాల్సిందే. అయితే, హెడ్ఫోన్స్, లౌడ్ మ్యూజిక్తో వినికిడి శక్తి తగ్గిపోతుందని, చెవుడు తప్పదని తాజా అధ్యయనం హెచ్చరించింది.
హెడ్ఫోన్స్ వాడకం, లౌడ్ మ్యూజిక్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల మంది యువతకు వినికిడిలోపం వచ్చే ప్రమాదం ఉందని యూఎస్లోని సౌత్ కరోలినా వర్సిటీ పరిశోధకులు గుర్తించారు. ప్రతిరోజూ హెడ్ఫోన్, ఇయర్బడ్స్ వాడుతున్న, పెద్దగా సంగీతం వినే 12-34 ఏండ్ల వయసున్న 19,046 మంది డాటాను పరిశోధకులు సేకరించారు. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన మరో 35 అధ్యయనాలను పరిశీలించారు.
వీటి ఆధారంగా వందకోట్లకుపైగా యువతకు వినికిడి లోపం ముప్పు ఉందని తేల్చారు. పెద్దలకు 80 డెసిబుల్స్, పిల్లలకు 75 డెసిబుల్స్ అనుమతించదగిన శబ్ధస్థాయిలుకాగా, సరాసరిగా అందరూ 105 డెసిబుల్స్తో సంగీతం వింటున్నారని, ఇది వినికిడిలోపం ముప్పును పెంచుతున్నదని పరిశోధకులు తేల్చారు. రాబోయే కాలంలో 67 కోట్ల మంది నుంచి 135 కోట్ల మంది వరకు వినికిడి సమస్య ఎదుర్కోనున్నారని కనుగొన్నారు.