టోరంటో, జనవరి 31: కెనడాలోని బ్రాంప్టన్లోని గౌరీ శంకర్ మందిరంపై గుర్తు తెలియని దుండగులు విద్వేష వ్యాఖ్యలు రాశారు. ఆలయ గోడలపై భారత్ వ్యతిరేక రాతలు రాయడంపై టోరంటోలోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనను ఖండించింది. ఇలాంటి విద్వేష, విధ్వంసకర చర్యల వల్ల కెనడాలోని భారతీయుల మనోభావాలు తీవ్రంగా దెబ్బ తింటున్నాయని తెలిపింది. అలాగే వారికి తీవ్ర హాని, ఇబ్బందులు కలిగిస్తున్నాయని చెప్పింది. ఈ విషయాన్ని కెనడా అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు వెల్లడించింది. కెనడాలో గత జూలై నుంచి ఇలాంటివి మూడు ఘటనలు జరగటం గమనార్హం.