కైరో: గాజాపై ఇజ్రాయెల్ (Israel) సైన్యం నలువైపుల నుంచి దాడులకు పాల్పడుతున్నది. హమాస్ (Hamas) స్థావరాలను ధ్వంసం చేస్తూ గాజా స్ట్రిప్ (Gaza Strip) స్వాధీనం దిశగా ముందుకు సాగుతున్నది. దీంతో హమాస్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నది. తమ వద్ద బంధీలుగా (Hostages) ఉన్న వారిలో 70 మహిళలు, చిన్నారులను విడిచిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. అయితే ఐదు రోజులపాటు యుద్ధాన్ని నిలిపివేయాలని షరతు విధించింది. గాజా స్ట్రిప్లోని అన్ని ప్రాంతాల్లో మనవతా సాయానికి అనుమతించాలంటూ ఇజ్రాయెల్-హమాస్ మధ్య సయోధ్య కుదుర్చేందుకు ప్రయత్నిస్తున్న ఖతర్కు (Qatar) స్పష్టం చేసింది.
తమ వద్ద బందీలుగా ఉన్నవారిని విడిచిపెట్టాలంటే ఐదు రోజులపాటు కాల్పుల విరమణ ప్రకటించాలని, యుద్ధాన్ని పూర్తిగా నిలిపివేయాలని హమాస్ ప్రతినిధి అబు ఉబైదా (Abu Ubaida) పేర్కొన్నారు. దీంతోపాటు గాజాలోని అన్ని ప్రాంతాల్లో మానవతా సహానికి అనుమతించాలని చెప్పారు. ఈ ఒప్పందాన్ని నిర్లక్ష్యం చేసినా, ఆలస్యం చేసినా ఇజ్రాయెల్దే బాధ్యత అంటూ ఓ ఆడియో రికార్డును విడుదల చేశారు.
కాగా, ఇజ్రాయెల్ దాడుల వల్ల గాజాలోని అల్షిఫా దవాఖానలో (Al Shifa Hospital) తీవ్ర విద్యుత్ కొరత ఏర్పడింది. దీంతో నెలలు నిండకుండానే తక్కువ బరువుతో పుట్టిన నవజాత శిశువులను (Tiny babies) ఇంక్యుబేటర్ల నుంచి బయటకు తీసి సాధారణ బెడ్స్పై ఉంచారు. వెచ్చదనం కోసం శిశువుల చుట్టూ పచ్చని బట్టతో చుట్టారు. దీంతో వారి ప్రాణాలు ప్రమాదంలోపడ్డాయి. దవాఖానలో ప్రస్తుతం ఉన్న నవజాత శిశువుల సంఖ్య 39 నుంచి 36కు తగ్గిందని అల్షిఫా పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ అధిపతి డాక్టర్ మొహమ్మద్ తబాషా చెప్పారు. అయితే అల్షిఫా దవాఖాన పరిస్థితిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) స్పందించారు. దవాఖానను రక్షించాల్సిన అవసరం ఉందని, ఇందుకు ఇజ్రాయెల్ చొరవ తీసుకోవాలన్నారు.