జెరూసలేం: ఇజ్రాయెల్-హమాస్ మిలిటెంట్ల మధ్య జరుగుతోన్న పోరును ఉద్దేశించి పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్బర్గ్ (Greta Thunberg) చేసిన ట్వీట్కు ఇజ్రాయెల్ దీటుగా బదులిచ్చింది. గాజాకు మద్దతుగా కొందరితో కలిసి ప్లకార్డులు ప్రదర్శిస్తోన్న చిత్రాన్ని థన్బర్గ్ ట్విటర్లో పోస్టు చేశారు. ‘పాలస్తీనా, గాజాకు మా మద్దతు ప్రకటిస్తున్నాం. ప్రస్తుత పోరుపై ప్రపంచం స్పందించాలి. పాలస్తీనా ప్రజలు, ఇతర బాధితుల తరఫున తక్షణమే కాల్పుల విరమణ, న్యాయం, స్వేచ్ఛ కోసం పిలుపునివ్వాలి’ అని గ్రెటా తన ట్వీట్లో పేర్కొన్నారు.
దీనిపై ఇజ్రాయెల్ స్పందిస్తూ.. ‘హమాస్ దాడుల వల్ల ఎంతోమంది అమాయకులైన ఇజ్రాయెల్ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఆ నరమేధ బాధితులు మీ స్నేహితులు కూడా కావొచ్చు. వారి కోసం మాట్లాడండి’ అంటూ ఘాటుగా స్పందించింది. కాగా, హమాస్ ఉగ్రదాడి అనంతరం గాజాపై ఇజ్రాయెల్ బలగాల భీకర దాడులు కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో బాంబుల వర్షం కురుస్తోంది.
శుక్రవారం ఖాన్ యూనిస్లోని నాసర్ ఆస్పత్రికి అంబులెన్సులు వరుస కట్టి రావడం కనిపించింది. గాజాలో రెండో అతిపెద్ద ఆస్పత్రి అది. ఇప్పటికే అధిక సంఖ్యలో రోగులు, క్షతగాత్రులతో పాటు ఆశ్రయం కోరి ఉన్నవారితో ఆ ఆస్పత్రి కిక్కిరిసి ఉంది. శుక్రవారం నాటి దాడులతో అక్కడ మరింత ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.