ఉటాహ్: హాలీవుడ్ నటి గ్వినత్ పాల్ట్రో(Gwyneth Paltrow).. నష్టపరిహారం కేసులో విజయం సాధించింది. ఆమె కోరినట్లే ఒక డాలర్ చెల్లించాలని ప్రత్యర్థిని కోర్టు ఆదేశించింది. కేసు వివరాల్లోకి వెళ్తే.. 2016లో అమెరికాలోని ఉటాహ్ రిసార్టు(Utah resort)లో ప్రమాదం జరిగింది. స్కీయింగ్(skiing) చేస్తున్న సమయంలో తనను పాల్ట్రో ఢీకొట్టినట్లు 76 ఏళ్ల డాక్టర్ టెర్రీ సాండర్సన్(Terry Sanderson) కేసు వేశాడు. తనకు మూడు లక్షల డాలర్లు చెల్లించాలని కోర్టును ఆయన ఆశ్రయించారు. ప్రమాదం వల్ల తన ఆరోగ్యం దెబ్బతిన్నట్లు ఆయన తన పరిహారం కేసులో ఆరోపించారు.
అయితే కౌంటర్గా నటి పాల్ట్రో కూడా కేసు వేసింది. ఆ ప్రమాదానికి కారణం అండర్సన్ అని, తనకు నష్టపరిహారంగా డాలర్ ఇవ్వాలని ఆమె కోర్టులో కేసు వేసింది. గురువారం ఈ కేసులో తుది తీర్పు వెల్లడైంది. స్కీయింగ్ ప్రమాదంలో పాల్ట్రో తప్పేమీ లేదని కోర్టు ఆ కేసును కొట్టిపారేసింది. పాల్ట్రోకు డాలర్ నష్టపరిహారం(one dollar damage)తో పాటు లీగల్ ఫీజులు(legal fees) చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అయితే లీగల్ ఫీజుల పరిహారం మాత్రం వేల డాలర్లలో ఉండే అవకాశం ఉంది. దానిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.