లాగోస్ : వాయువ్య నైజీరియాలోని ఓ బోర్డింగ్ స్కూల్ నుంచి సాయుధ దుండగులు 140 మంది విద్యార్ధులను కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. గత కొద్ది రోజులుగా విద్యార్ధులను మూకుమ్మడిగా అపహరించే ఉదంతాలు పెరిగిన క్రమంలో నైజీరియాలో తాజా ఘటన ఆందోళన రేకెత్తిస్తోంది. గతంలో సాయుధ క్రిమినల్ గ్యాంగ్స్ గ్రామాలపై దాడులు చేసి పశువులను ఎత్తుకెళ్లడం, భారీ మొత్తాలు డిమాండ్ చేయడం నిత్యకృత్యం కాగా తాజాగా సాయుధ దుండగులు స్కూల్ విద్యార్ధులను టార్గెట్ చేస్తున్నారు.
ఇక తాజా ఘటనలో కదున రాష్ట్రంలోని బెథెల్ బాప్టిస్ట్ హైస్కూల్ ఫెన్సింగ్ను సాయుధ దుండగులు సోమవారం తెల్లవారుజామున బద్దలుగొట్టి స్కూల్కు చెందిన 140 మంది విద్యార్ధులను కిడ్నాప్ చేశారు. వీరిలో20 మంది తప్పించుకోగా మిగిలిన వారిని దుండగులు ఎక్కడికి తీసుకువెళ్లారో తెలియడం లేదని స్కూల్ టీచర్ ఇమ్మానుయేల్ పాల్ వెల్లడించారు.
స్కూల్ విద్యార్ధుల కిడ్నాప్ ఘటనను కదున రాష్ట్ర పోలీస్ ప్రతినిధి మహ్మద్ జలిగె ధ్రువీకరించారు. స్ధానిక పోలీసులు కిడ్నాపర్లను వెంబడిస్తున్నారని చెప్పారు. ఇక గత ఏడాది డిసెంబర్ నుంచి నైజీరియాలోని వివిధ స్కూల్స్ నుంచి దాదాపు వేయి మంది విద్యార్ధులను సాయుధ దుండగలు అపహరించారు. స్ధానిక అధికారుల సంప్రదింపులతో వీరిలో చాలా మంది విడుదల కాగా, మరికొందరు ఇంకా దుండగుల చెరలోనే ఉన్నారు.