Strait of Hormuz : హార్ముజ్ జలసంధి వద్ద వాణిజ్య నౌకలపై ఇరాన్ సైన్యం కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పులకు గురైన మూడు నౌకల్లో ఒకటి భారత్కు వస్తున్న నౌక కూడా ఉంది. ఈ నౌక ఇండియాకు వస్తున్నప్పటికీ, అది ఇండియా నౌక కాదు. ఈ నౌకలపై కాల్పులు జరపడంతోపాటు, వాటిని ఐఆర్జీసీ (ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్) స్వాధీనం చేసుకుంది.
ఈ మూడు నౌకల్లో ఒకటి పనామాకు చెందిన ఎంఎస్సీ ఫ్రాన్సెసా కాగా, రెండోది లైబీరియాకు చెందిన ఎపామినోడోస్ అనే నౌక. మూడో నౌక గ్రీక్కు చెందిన యుఫోరియా. ఇందులో ఎపామినోడోస్ అనే నౌక దుబాయ్ నుంచి ఇండియాలోని గుజరాత్, ముంద్రా పోర్టుకు వస్తున్నట్లు మ్యారిటైమ్ ట్రాఫిక్ డాటా ద్వారా తెలుస్తోంది. తాజాగా నౌకలపై ఇరాన్ దాడి చేయడంతో హార్ముజ్ జలసంధి వద్ద మరింత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గత వారం ఇండియా నౌకపై ఐఆర్జీసీ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఇండియా.. ఇరాన్ రాయబారికి నోటీసులు జారీ చేసింది. ఇటీవల రెండు ఇరాన్ నౌకల్ని గల్ఫ్ ఆఫ్ ఒమన్ వద్ద అమెరికా దిగ్బంధించిన సంగతి తెలిసిందే. బదులుగా ఇరాన్.. ఈ నౌకలపై దాడి చేసి, వాటిని తమ అధీనంలోకి తీసుకుంది.
ఒకవైపు కాల్పుల విరమణకు అమెరికా అంగీకరించినప్పటికీ, ఇరాన్ మాత్రం అంగీకరించడం లేదు. అమెరికాతో శాంతి చర్చలకు కూడా ఇరాన్ విముఖత చూపుతోంది. మరోవైపు ‘దేశ్ గరిమ’ అనే భారత నౌక ముంబై తీరానికి చేరుకుంది. ఇందులో 31 మంది సిబ్బంది ఉన్నారు. అలాగే, భారీ స్థాయిలో ముడి చమురు ఉంది. ఈ నౌక హార్ముజ్ నుంచి ఈ నెల 18న బయల్దేరింది. ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హార్ముజ్ జలసంధి నుంచి ఇండియా చేరుకున్న పదో భారత నౌక ఇది.