ఉట్నూర్ రూరల్, జూన్ 13: ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో పిడుగుపాటుతో మృతిచెందిన కుటుంబాలను ఆదుకుంటామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. జిల్లాలోని గాదిగూడా మండలంలోని పిప్పిరి గ్రామంలో నలుగురు, బేల మండలంలోని సొన్నాస్, సాంగ్వీడి గ్రామంలో ఇద్దరు పిడుగు పాటుతో మృతి చెందడం దురదృష్టకరమని చెప్పారు. వారి మృతి తనను తీవ్రంగా కలిచివేసిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వర్షాలు కురుస్తున్న సమయంలో రైతులు పంట పొలాల్లోకి వెల్లకూడదని సూచించారు. పిడుగు పాటుతో తీవ్ర గాయాలై రిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యాన్ని అందించాలని డాక్టర్లను ఆదేశించారు. మృతుల పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు.