కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సే గురువారం సింగపూర్ చేరుకున్నారు. ఆర్థిక, రాజకీయ సంక్షోభం నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున శ్రీలంకను వీడిన ఆయన తన భార్యతో కలిసి వాయుసేన విమానంలో మాల్దీవుల రాజధాని మాలేకు వచ్చారు. అయితే అక్కడ కూడా నిరసన సెగ తగిలింది. మాలేలోని శ్రీలంక వాసులు బుధవారం పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ‘గొటబయ గో’ అంటూ నినాదాలు చేశారు. స్థానిక ప్రతిపక్ష పార్టీ కూడా ఆయన రాకను వ్యతిరేకించింది. దీంతో తమ దేశం విడిచి వెళ్లాలని మాల్దీవుల ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో గొటబయ రాజపక్సే తన భార్య లోమా, ఇద్దరు బాడీ గార్డులతో కలిసి సౌదీ ఎయిర్లైన్స్ విమానంలో గురువారం సాయంత్రం సింగపూర్కు చేరుకున్నారు.
కాగా, శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సేకు రాజకీయ ఆశ్రయం ఇవ్వడం లేదని సింగపూర్ ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యక్తిగత పర్యటన కోసమే ఆయన సింగపూర్కు వచ్చినట్లు ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఆయన (గొటబయ) ఆశ్రయం కోరలేదు. ఆయనకు ఎలాంటి ఆశ్రయం ఇవ్వలేదు. సాధారణంగా ఆశ్రయం కోసం చేసే అభ్యర్థనలను సింగపూర్ ప్రభుత్వం మంజూరు చేయదు’ అని విదేశీ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
మరోవైపు అధ్యక్ష పదవికి రాజీనామా చేయకుండా దేశాన్ని అనిశ్చితి పరిస్థితిలో ఉంచి పారిపోయిన గొటబయ రాజపక్సే కొన్ని రోజులు సింగపూర్లోనే ఉంటారని శ్రీలంక సైనిక వర్గాలు తెలిపాయి. అనంతరం ఆయన యూఏఈకి వెళ్లవచ్చని చెప్పాయి. కాగా, శ్రీలంక సైన్యం గురువారం రంగంలోకి దిగింది. ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లకుండా, ఎలాంటి ప్రాణ నష్టం జరుగకుండా ఉండేందుకు ఆ దేశ సైనికులు వాహనాల్లో రాజధాని కొలంబో రోడ్లపైకి వచ్చారు. నిరసనకారులు పెద్ద సంఖ్యలో చొరబడిన అధ్యక్ష, ప్రధాని భవనాల వద్ద భారీగా సైనిక వాహనాలను మోహరించారు.
#WATCH | A Saudi airlines plane, carrying Sri Lanka's president Gotabaya Rajapaksa, arrived from the Maldives at Singapore's Changi Airport earlier this evening.
(Video Source: Reuters) pic.twitter.com/ZcIMxXN9l8
— ANI (@ANI) July 14, 2022