కాలిఫోర్నియా: గూగుల్ కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్(Sundar Pichai).. 2022 సంవత్సరానికి సుమారు 226 మిలియన్ల డాలర్ల పరిహారాన్ని అందుకున్నారు. ఒకవైపు కంపెనీలో ఉద్యోగాల కోత ఉన్నా.. ఆయన ఆర్జన మాత్రం గణనీయంగా పెరిగింది. గత ఏడాది పిచాయ్ అందుకున్న జీతంలో.. స్టాక్ అవార్డుల ద్వారా 218 మిలియన్ల డాలర్లు వచ్చాయి. స్టాక్ కంపెనీ ఫైలింగ్లో సుందర్ పిచాయ్ తాను అందుకున్న ఆదాయ వివరాల గురించి తెలిపారు.
కంపెనీలో సగటు ఉద్యోగికి, సీఈవోకు మధ్య జీతంలో భారీ వ్యత్యాసం ఉంది. అయితే గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ మరో వైపు ఉద్యోగుల్ని తొలగిస్తుంటే, సుందర్ పిచాయ్ జీతం పెరగడం శోచనీయంగా మారింది. ఇటీవల లే ఆఫ్స్ను వ్యతిరేకిస్తూ లండన్లో ఉన్న వేలాది మంది గూగుల్ ఉద్యోగులు భారీ వాకౌట్ చేపట్టిన విషయం తెలిసిందే.
మార్చి నెలలో జూరిచ్లో ఉన్న గూగుల్ ఉద్యోగులు సుమారు 200 మంది కూడా నిరసన చేపట్టారు.