లండన్ : ఇంగ్లండ్లోని బ్లెన్హైమ్ ప్యాలెస్లో ఉన్న బంగారు టాయిలెట్(Golden Toilet)ను దోచుకెళ్లారు. ప్యాలెస్తో చొరబడిన దొంగలు తమ వద్ద ఉన్న భారీ సుత్తెలతో ఆ టాయిలెట్ను పగులగొట్టి.. కేవలం అయిదు నిమిషాల్లోనే అక్కడ నుంచి పరారీ అయినట్లు తెలుస్తోంది. 2019 సెప్టెంబర్లో జరిగిన ఆ చోరీ గురించి సోమవారం ఆక్స్ఫర్డ్ క్రౌన్ కోర్టులో ప్రాసిక్యూటర్లు వివరించారు. 18 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన ఆ టాయిలెట్ను అమెరికాగా నామకరణం చేశారు. దాన్ని ఇటాలియన్ ఆర్టిస్టు మౌరిజియో క్యాటెలన్ తయారు చేశారు. ఆ టాయిలెట్ కుండీ బరువు సుమారు 98 కేజీలు ఉంటుంది. దాన్ని సుమారు ఆరు మిలియన్ల డాలర్లకు బీమా చేసినట్లు ఆక్స్ఫర్డ్ కోర్టుకు లాయర్లు తెలిపారు.
టాయిలెట్ కుండీని దోచికెళ్లిన సమయంలో.. దానిపై ఉన్న బంగారం విలువ అప్పట్లోనే సుమారు 30(2.8 మిలియన్ల పౌండ్లు) కోట్లు ఉంటుందని అంచనా వేశారు. 2019 సెప్టెంబర్ 14వ తేదీ రాత్రి జరిగిన చోరీలో తన పాత్ర లేదని ఆక్స్ఫర్డ్కు చెందిన 39 ఏల్ల మైఖేల్ జోన్స్ కోర్టుకు తెలిపారు. 36 ఏళ్ల ఫ్రెడ్రిక్ సైన్స్, 41 ఏళ్ల బోరా గుకుక్లు కూడా కోర్టు ముందు విచారణకు హాజరయ్యారు. బంగారు టాయిలెట్ను పగులగొట్టిన తర్వాత.. సుత్తెలను అక్కడే విడిచివెళ్లినట్లు కోర్టుకు తెలిపారు.
గోల్డెన్ టాయిలెట్ను ఎత్తుకెళ్లిన తర్వాత దాన్ని ముక్కలుగా చేసి.. ఆ బంగాన్ని అమ్మేందుకు దొంగలు ప్రయత్నించారు. హటన్ గార్డెన్ జ్వలరీ షాపుతో ఆ దొంగలు లింక్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. చాలా జాగ్రత్తగా దొంగతనం చేసినట్లు ప్రాసిక్యూటర్ జులియన్ క్రిస్టోఫర్ తెలిపారు. చోరీ చేసిన వాహనాల్లో వచ్చిన అయిదుగురు.. చెక్క గేట్లను పగులగొట్టి, ప్యాలెస్లోకి ప్రవేశించారు. టాయిలెట్ ఎక్కడుందో తెలిసిన ఆ దొంగలు.. అక్కడ డోర్ను బ్రేక్ చేసి, ఆ తర్వాత టాయిలెట్ను తీసివేసి, 5 నిమిషాల్లో అక్కడ నుంచి పరారీ అయినట్లు గుర్తించారు.