కెన్యా : కెన్యాలో ఏర్పడిన తీవ్ర కరువు పరిస్థితులు వన్యప్రాణులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తాగేందుకు చుక్క నీరు లేక అల్లాడిపోతున్న మూగజీవాలు విగతజీవులుగా మారిపోతున్న ఘటనలు హృదయాలను కదిలిస్తున్నాయి. కెన్యాలోని సబోలి వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో నీటి కోసం అల్లాడిన జిరాఫీలు చివరకు ప్రాణాలు కోల్పోయి గుంపులుగా పడి ఉన్న దృశ్యాలు అక్కడి కరువు కాటకాలకు అద్దం పడుతున్నాయి.
కొంతకాలంగా కెన్యా ఈశాన్య ప్రాంతంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇది సబోలిలోని వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో జంతువులకు ప్రాణసంకటంగా మారింది. ఎక్కడ చూసినా తిండి, నీరు లభించక ప్రాణాలు కోల్పోయిన జంతువుల కళేబరాలే దర్శనమిస్తున్నాయి. తాజాగా వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో జిరాఫీలు నీటి కోసం తీవ్రంగా వెతికాయి. చివరకు ఓ బురద కుంట వద్దకు చేరుకున్న జిరాఫీలు.. ఆ బురదలోనే కూరుకుపోయి చనిపోయాయి. ఒకేచోట ఆరు జిరాఫీలు విగతజీవులుగా పడిఉన్న హృదయవిదారక దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.