పారిస్ : ఫ్రాన్స్లో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఒకే రోజు 1,04,611 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఫ్రాన్స్ వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. గత మూడు రోజుల నుంచి ఫ్రాన్స్లో పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదు అవుతున్నాయి. కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో ఆ దేశ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ మాక్రాన్ కీలక అధికారులతో కొవిడ్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం చర్చించనున్నారు.
ఒమిక్రాన్ వేరియంట్ కూడా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో బూస్టర్ డోస్కు కూడా ఫ్రాన్స్ అనుమతి ఇచ్చింది. రెండు డోసులు వేసుకుని మూడు నెలలు పూర్తయితే బూస్టర్ డోసు తీసుకోవాలని ఆదేశించింది. బూస్టర్ డోస్కు ప్రజలు అంగీకరిస్తేనే మొదటి రెండు డోసులకు సంబంధించి చెల్లుబాటు అయ్యే పాస్ను జారీ చేయాలని ఫ్రాన్స్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కేఫ్లు, రెస్టారెంట్లు, బహిరంగ ప్రదేశాలు, అంతర్జాతీయ రాకపోకలకు ఈ పాస్ను తప్పనిసరి చేయనున్నారు. ఫ్రాన్స్లో ఇప్పటి వరకు కరోనాతో 1,22,546 మంది మరణించారు. కరోనా వ్యాక్సినేషన్ 76.5 శాతం పూర్తయింది.