పారిస్: ప్రపంచంలోని చాలా దేశాలు కరోనా సెకండ్ వేవ్తో సతమమవుతుండగా మరి కొన్ని దేశాలు థర్డ్ వేవ్ ముంగిట ఉన్నాయి. అయితే ఫ్రాన్స్లో కరోనా ఫోర్త్ వేవ్ కలకలం రేపుతున్నది. డెల్టా వేరియంట్ కాంతివేగంతో వ్యాప్తిస్తున్నదని ఆ దేశ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వారం రోజుల్లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 140 శాతానికి పెరిగిందని వెల్లడించాయి. బుధవారం 21 వేలకుపైగా కొత్త కేసులు నమోదు కాగా, ఇందులో 98 శాతం మంది వ్యాక్సిన్ వేయించుకోని వారేనని పేర్కొన్నారు.
మరోవైపు కరోనా ఫోర్త్ వేవ్ను నియంత్రించేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం మరోసారి కఠిన ఆంక్షలు విధించింది. కరోనా టీకా ప్రక్రియను వేగవంతం చేయడంతోపాటు వ్యాక్సిన్ వేయించుకోని వారికి వ్యతిరేకంగా పలు నిబంధనలు ప్రకటించింది. సాంస్కృతిక వేదికలు, అమ్యూజ్మెంట్ పార్కులు, జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్కు వెళ్లేవారు తప్పని సరిగా కరోనా టీకా తీసుకున్న సర్టిఫికెట్ లేదా కరోనా నెగిటివ్ రిపోర్ట్ లేదా కరోనా నుంచి కోలుకున్న పత్రాలను చూపించాలని పేర్కొంది.
ఆగస్ట్ నుంచి రెస్టారెంట్లు, బార్లలోకి ప్రవేశానికి, రైళ్లు, విమానాల్లో ప్రయాణానికి హెల్త్ పాస్ అవసరమని ఫ్రాన్స్ ప్రభుత్వం వెల్లడించింది. ప్రజలు టీకాలు వేసుకునేలా పోత్సహించడానికి హెల్త్ పాస్ను ప్రవేశపెట్టినట్లు ఫ్రాన్స్ ప్రధాని జీన్ కాస్టెక్స్ బుధవారం తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మూసిన వాటిని తెరిచేందుకు ఇది ఒక మార్గమని చెప్పారు.
కాగా, హెల్త్ పాస్ నిబంధనలు గౌరవించని వారికి 1500 యూరోలు, తొలిసారి ఉల్లంఘించిన వారికి 7,500 యూరోలు, మూడోసారి ఉల్లంఘించిన వారికి 9 వేల యూరోల జరిమానాతోపాటు ఏడాది జైలు శిక్ష విధించనున్నట్లు ఫ్రాన్స్ ప్రభుత్వం హెచ్చరించింది.