పోర్ట్ ఆఫ్ ప్రిన్స్ : హైతీ అధ్యక్షుడు జోవెనెల్ మొయిజ్ను తన అధికారిక నివాసంలోనే గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే అధ్యక్షుడిని హత్య చేసిన కేసులో అనుమానితులుగా ఉన్న నలుగుర్ని భద్రతా దళాలు తుదముట్టించినట్లు పోలీసులు తెలిపారు. మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుతో లింకు ఉన్న మరికొంత మంది అనుమానితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పరారీలో ఉన్న వారిని చంపేస్తాం లేదా పట్టుకుంటామని పోలీసు చీఫ్ లియాన్ చార్లెస్ తెలిపారు.
53 ఏళ్ల మొయిజ్ను అత్యంత దారుణంగా హత్య చేశారు. ఆయుధాలతో వచ్చిన కొందరు మొయిజ్ను కాల్చి చంపారు. ఈ విషయాన్ని తాత్కాలిక ప్రధాని క్లాడ్ జోసెఫ్ మీడియాతో తెలిపారు. దాడిలో గాయపడ్డ అధ్యక్షుడి భార్య ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మొయిజ్ శరీరంలోకి పలు చోట్ల బుల్లెట్లు దిగినట్లు పోలీసులు చెప్పారు. ఆఫీసు, బెడ్రూమ్లో ఉన్న వస్తువులను ఎత్తుకెళ్లారు.