ఇస్లామాబాద్: పాకిస్థాన్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా వరదల వల్ల సుమారు 10 బిలియన్ల డాలర్ల నష్టం జరిగి ఉంటుందని ఆ దేశ మంత్రి అహసాన్ ఇక్బాల్ పేర్కొన్నారు. దేశంలోని మూడవ వంతు భాగం నీటిలో మునిగిపోయినట్లు కూడా మరో మంత్రి వెల్లడించారు. అయితే వర్షాలు, వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాకిస్థాన్కు సోమవారం ప్రత్యేక సాయం అందించింది. ఆదేశానికి 1.1 బిలియన్ డాలర్ల బెయిలౌట్ ప్యాకేజీని ఐఎంఎఫ్ రిలీజ్ చేసింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాక్ను ఆదుకునేందుకు ఐఎంఎఫ్ ఆ సహాయాన్ని అందించింది.
పాకిస్థాన్లో రుతుపవనాల వల్ల ఆకస్మికంగా వచ్చిన వరదలతో ఇప్పటి వరకు సుమారు 1136 మంది మరణించారు. సుమారు 33 మంది మిలియన్ల జీవితాలు ఆగం అయ్యాయి. దేశంలోని 15 శాతం జనాభా వరదల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వర్షాల వల్ల రోడ్ఉల, పంటలు, ఇండ్లు, బ్రిడ్జ్లు, ఇతర మౌళిక సదుపాయాలు ధ్వంసం అయ్యాయి. రానున్న రోజుల్లో దేశంలో తీవ్ర ఆహార కొరత ఏర్పడుతుందని మంత్రి ఇక్బాల్ తెలిపారు. 2010లో వచ్చిన వరదల కన్నా ఇప్పుడు పరిస్థితి దారుణంగా ఉందన్నారు. 2010లో వరదల వల్ల దేశంలో రెండు వేల మందికిపైగా మరణించారు.