ఎమర్జింగ్ టెక్నాలజీస్ (అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం)ను అత్యంత సమర్థవంతంగా వినియోగించడంలో మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. ఒక్కో టెక్నాలజీకి ఒక ఫ్రేమ్ వర్క్ను రూపొందించి, దాని వినియోగం కోసం ప్రభుత్వం ఏకంగా ఒక్కోదానికి పాలసీ రూపొందించింది. తద్వారా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం ప్రజల జీవన విధానాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేలా చేస్తున్నారు. ఉదాహరణకు డ్రోన్ పాలసీ కింద మారుమూల ప్రాంతాల్లో ఉన్నవారికి మందులను అత్యవసర సమయంలో అత్యంత వేగంగా అందించేందుకు డ్రోన్లను రాష్ట్రంలో వినియోగించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన అనుమతుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇలా ఎమర్జింగ్ టెక్నాలజీస్ కింద గుర్తించిన 9 టెక్నాలజీలపై దృష్టిసారించి, వాటి వినియోగం కోసం ఫ్రేమ్ వర్క్లను రూపొందించి, సమర్థవంతంగా అమలు చేసే పనిలో ఐటీశాఖ నిమగ్నమైంది.
ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల్లో లీడర్గా ఉండడంతోపాటు వాటి అవసరం ఎక్కడో గుర్తించి వినియోగించుకోవడమే లక్ష్యంగా చేసుకొని తెలంగాణ ఐటీ శాఖ ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఇప్పటికే నిపుణులైన మానవవనరుల లభ్యత ఇక్కడ పుష్కలంగా ఉండడంతో అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులు నగరానికి వెల్లువలా వస్తున్నాయి. స్థానికంగా, దేశీయంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని సంస్థలకు ఐటీ పరంగా సేవలందించాలంటే నిపుణుల అవసరం తప్పనిసరి.
అలాంటి ఐటీ నిపుణులు ప్రస్తుతం ఎమర్జింగ్ టెక్నాలజీస్లో నైపుణ్యం కలిగి ఉండడం ఎంతో ముఖ్యం. ప్రపంచంలోని పలు దేశాలకు ఐటీ సేవలు అందించాలంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్లో నైపుణ్యం ఉండడం అత్యంత కీలకంగా మారింది. విద్యాలయాల్లో అలాంటి టెక్నాలజీస్ బోధించే వారే లేరు. కొన్ని యూనివర్సిటీలు అలాంటి సిలబస్ను విద్యార్థులకు బోధించేందుకు ముందుకు రావడం లేదు. ఉన్నత విద్యావ్యవస్థలో ఇలాంటి పరిస్థితులను గుర్తించిన ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని ఐటీ అండ్ ఈసీ మంత్రిత్వశాఖలో ప్రత్యేకంగా ఎమర్జింగ్ టెక్నాలజీ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ప్రజలకు అందించే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మూస పద్ధతిన కాకుండా అందుబాటులో ఉన్న టెక్నాలజీతో అందించేలా అవసరమైన ఫ్రేమ్ వర్క్ను అభివృద్ధి చేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో వస్తున్న మార్పులను గుర్తించి వాటిని ప్రభుత్వమే నేరుగా ఎలా వినియోగించుకోవాలి ? అందుకోసం ప్రాథమికంగా చేయాల్సిన పనులన్నీ ఐటీశాఖయే నిర్వహిస్తున్నది. ఇప్పటికే ఎమర్జింగ్ టెక్నాలజీస్ల కింద 9 కీలక టెక్నాలజీస్లను గుర్తించారు. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, బ్లాక్చెయిన్, క్లౌడ్ కంప్యూటింగ్, రోబోటిక్ అండ్ డ్రోన్ టెక్నాలజీ, 3డీ ప్రింటింగ్, వీఆర్ అండ్ ఏఆర్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, స్పేస్ టెక్నాలజీ వంటివి ఉన్నాయి. వీటిద్వారా పరిశ్రమకు అవసరమైన అనుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయడం, మరొకటి ప్రభుత్వ విభాగాల్లో వీటిల్లో సమర్థవంతంగా ఎలా వినియోగించుకోవాలన్న దానిపై దృష్టిసారించారు. ప్రైవేటు ఐటీ సంస్థలు చేయాల్సిన పనిని తెలంగాణ ఐటీ శాఖ చేస్తోంది.
రాష్ట్రంలో కృత్రిమ మేథస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) రంగాన్ని ప్రోత్సహించేందుకు వివిధ సంస్థలతో బహుళ ప్రయోజనాలు ఉండేలా ఒప్పందాలు చేసుకోవడంలో ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ చూపించారు. ప్రజల జీవితాలపై రోజువారీగా ఎమర్జింగ్ టెక్నాలజీస్ చూపుతున్న ప్రభావాన్ని లోతుగా అర్థం చేసుకోవడంతోపాటు కృత్రిమ మేథస్సు రంగంలో రాష్ర్టాన్ని అగ్ర స్థానంలో నిలిపేందుకు గతేడాది జనవరి 2న రాష్ట్ర ప్రభుత్వం 2020 సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ ఏఐగా ప్రకటించింది. ఆరోగ్యం, వ్యవసాయం, రవాణా, న్యాయ, విద్యరంగాలపై దృష్టి సారించి ఏఐ ద్వారా నూతన ఆవిష్కరణలకు బాటలు వేయాలని నిర్ణయించారు. బలమైన భాగస్వామ్యం కోసం ఇంటెల్, ఎన్విడియా, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, నాస్కామ్, ఐఐటీ వంటి సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. విద్యాసంస్థలు, స్టార్టప్లు, పౌర సమాజంతో సంప్రదింపుల తర్వాత ఆచరణయోగ్యంగా ఉండేలా ఏఐ విధానాలను రూపొందించి గతేడాది జూన్లో ఏఐ ఫ్రేమ్వర్క్ను ప్రభుత్వం విడుదల చేసింది.
ఎమర్జింగ్ టెక్నాలజీస్లలో ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. అన్నీ కలిపి ఒకే గొడుగు కింద కాకుండా ఒక్కో టెక్నాలజీకి ప్రత్యేకంగా ప్రభుత్వం పాలసీ తీసుకొచ్చింది. క్లౌడ్ అడాప్షన్ పాలసీ కింద క్లౌడ్ అడాప్షన్ జీవో, ఫ్రేమ్ వర్క్-2020ను రూపొందించింది. ఏఐ ఫ్రేమ్వర్క్-2020, డ్రోన్ ఫ్రేమ్ వర్క్-2019, బ్లాక్ చైయిన్ ఫ్రేమ్వర్క్-2019లను అమల్లోకి తెచ్చింది. ఉదాహరణకు వ్యవసాయంలో డ్రోన్ టెక్నాలజీని విరివిగా వాడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ప్రభుత్వ రంగ సంస్థలైన ప్రజా పంపిణీ వ్యవస్థలో వినియోగిస్తున్నారు. సైబర్ సెక్యూరిటీకి సంబంధించి బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడుతున్నారు. ఒక్కో టెక్నాలజీకి విస్తృత ప్రయోజనాలు ఉండడంతో ప్రతి దానికి ఒక ఫ్రేమ్ వర్క్ రూపొందించి అమల్లోకి తీసుకొస్తున్నామని ఐటీశాఖ అధికారి ఒకరు తెలిపారు.
ఐటీలో టెక్నాలజీస్ పరంగా శరవేగంగా మార్పులు వస్తుంటాయి. వాటిని గుర్తించి మరింత విజ్ఞానాన్ని పెంపొందించుకుంటేనే ఈ రంగంలో నిలదొక్కుకుంటారు. మన ప్రభుత్వం కొత్త టెక్నాలజీలను గుర్తించి ఐటీ మంత్రిత్వశాఖలో ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ను ఏర్పాటు చేసి, వాటిని ప్రభుత్వపరంగా సమర్థవంతంగా వినియోగిస్తున్నారు. ప్రజలకు నేరుగా సేవలందించే ప్రభుత్వమే కొత్త టెక్నాలజీలను సద్వినియోగం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. తెలంగాణ ఐటీ శాఖ పనితీరు ఎంతో ప్రశంసనీయం. టీటా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిజిథాన్ కార్యక్రమాన్ని ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీలపై గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నాం. ఇందులో సుమారు 600 మంది ఇంటర్న్షిప్ తీసుకోగా, 80 శాతం మంది కొత్త టెక్నాలజీల వల్ల ఉద్యోగాలొచ్చాయి.- సందీప్కుమార్ మక్తల, టీటా గ్లోబల్ ప్రెసిడెంట్