ఓహియో: ఓ 5 ఏళ్ల బాలుడు ఇంట్లో పేరెంట్స్ తెచ్చిపెట్టుకున్న షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్స్ ప్యాకెట్ జేబులో పెట్టుకున్నాడు. ఆ తర్వాత వాటిని ఒక్కొక్కటిగా తియ్యగా అనిపించినంతసేపు నమలడం, మింగడం మొదలుపెట్టాడు. అలా ఒక్కటి కాదు, రెండు కాదు ఏకంగా 40 చూయింగ్ గమ్లను మింగేశాడు. అయితే ఆ గమ్లు కడుపులో మరింత కరిగిపోయి ఒకదానికి ఒకటి అతుక్కున్నాయి. అన్ని కలిసి ఒక గమ్ ముద్దలా తయారయ్యాయి.
దాంతో బాలుడి జీర్ణక్రియ మందగించింది. కడుపు ఉబ్బడం, వాంతులు, విరేచనాలు లాంటి సమస్యలు మొదలయ్యాయి. ఆ తర్వాత కడుపు నొప్పి వచ్చింది. ఏమైందో తెలియని అతడి తల్లి బాలుడి అవస్థ చూసి ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ సీటీ స్కాన్ చేసి చూసిన వైద్యులు కడుపులో ఏదో ముద్దగా ఉన్నట్లు గుర్తించారు. బాలుడిని ఏం తిన్నావని ప్రశ్నించగా చూయింగ్ గమ్లు కొరికి మింగిన విషయాన్ని చల్లగా చెప్పేశాడు.
మరింత ఆలస్యమైతే ప్రాణాలకే ప్రమాదమని భావించిన వైద్యులు వెంటనే సర్జరీ చేశారు. గొంతులో నుంచి పైపును చొప్పించి గడ్డకట్టుకుపోయిన గమ్ను పూర్తిగా లాగేశారు. ఒకేసారి ఏకధాటిగా కాకుండా కొంతసేపు గ్యాప్ ఇస్తూ విడతల వారీగా ఈ ప్రక్రియను పూర్తిచేశారు. దాంతో బాలుడి పేరెంట్స్ ఊపిరి పీల్చుకున్నారు. అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది.