సిడ్నీ: ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న టారొంగా జూ ఎన్క్లోజర్ నుంచి ఐదు సింహాలు తప్పించుకున్నాయి. దాంట్లో ఒక సింహంతో పాటు నాలుగు పిల్లలు ఉన్నాయి. దీంతో జూ పరిసరాల్లో కాసేపు ఎమర్జెన్సీ ప్రకటించారు. జూలో లాక్డౌన్ అమలు చేశారు. ఓ సింహాం పిల్లను పట్టుకునేందుకు దానికి మత్తు ఇవ్వాల్సి వచ్చింది. కానీ ఎన్క్లోజర్ నుంచి బయటకు వచ్చిన కొన్ని క్షణాల్లోనే వాటిని మళ్లీ బంధించారు. అయితే ఎలా ఆ సింహాలు ఎన్క్లోజర్ నుంచి తప్పించుకున్నాయో ఇంకా స్పష్టంగా తెలియదు.
జూ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ సైమన్ డఫీ మాట్లాడుతూ.. ఈ ఘటనపై విచారణ చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ఎన్క్లోజర్ నుంచి సుమారు వంద మీటర్ల దూరం వరకు సింహాలు వెళ్లినట్లు ఆయన చెప్పారు. సింహాలు బయటకు వచ్చిన సమయంలో ప్రధాన జూను మూసివేసి ఉంచినట్లు తెలిపారు.
బోను నుంచి సింహాలు తప్పించుకున్న పది నిమిషాల్లోనే అలారమ్ మోగినట్లు సీసీటీవీ ఫూటేజ్ ద్వారా గుర్తించారు.