న్యూయార్క్: ప్రసవానంతరం ఆందోళనగా అనిపిస్తున్నదా? పిల్లలు పుట్టారన్న ఆనందాన్ని కూడా అనుభూతి చెందలేకపోతున్నారా? ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తున్నాయా? అయితే ఈ ఆలోచనలు వస్తున్న మహిళలు పోస్ట్పార్టమ్ డిప్రెషన్ (పీపీడీ)తో బాధపడుతున్నారని అర్థం. దీనికి ఓ సరికొత్త ఔషధానికి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) అనుమతి ఇచ్చింది. సేజ్ థెరప్యూటిక్స్ కంపెనీ తయారు చేసిన జుర్జువే ఔషధం పోస్ట్పార్టమ్ డిప్రెషన్ను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని ఎఫ్డీఏ తెలిపింది.
ఇప్పటివరకు పోస్ట్పార్టమ్ డిప్రెషన్కు వైద్యుల సమక్షంలో ఇంజెక్షన్ను వేసేవారు. కానీ ప్రస్తుతం అనుమతి పొందిన జుర్జువేను నేరుగా నోటితో తీసుకునే వెసులుబాటు ఉంది. దీని వాడకం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని ఎఫ్డీఏ తెలిపింది. మైకం, అలసట, సాధారణ జలుబు, మూత్ర సంబంధిత సమస్యలు రావచ్చని పేర్కొంది. సాధారణంగా ప్రసవానికి ముందు, ప్రసవానంతరం గర్భిణీలు ఈ వ్యాధితో బాధపడుతుంటారు. విచారం, తమను తాము హానీ చేసుకోవడం, పిల్లలకు హానీ చేయడం ఈ మానసిక వ్యాధి లక్షణాలు. కానీ చాలామంది మహిళలు ఇది ఒక మానసిక వ్యాధి అని గుర్తించలేకపోవడం శోచనీయం. వ్యాధిని గుర్తించలేకపోవడంతో పాటు చికిత్సకు దూరమై తమలో తామే మానసికంగా కుంగిపోతున్నారు.