ఇస్లామాబాద్: పాకిస్థాన్కు చెందిన ప్రముఖ అణు శాస్త్రవేత్త డాక్టర్ అబ్దుల్ ఖదీర్ఖాన్ ఆదివారం కన్నుమూశారు. ఆయన వయసు 85 ఏళ్లు. పాకిస్థాన్ అణు కార్యక్రమ పితగా ఖదీర్ ఖాన్ను అభివర్ణిస్తారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అబ్దుల్ ఖదీర్ను.. ఆదివారం ఉదయమే హాస్పిటల్లో చేర్చారు. పాక్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7 గంటల సమయంలో ఖదీర్ మృతి చెందారు. ఆయన మృతిపై ట్విటర్ వేదికగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు.
డాక్టర్ అబ్దుల్ ఖదీర్ ఖాన్ మృతి చాలా బాధించింది. దేశమంతా ఆయనను ఎంతగానో ప్రేమిస్తుంది. జాతి భద్రత కోసం ఆయన అణ్వాయుధాలను ఇచ్చారు. పాక్ పౌరుల హీరో ఆయన అని కొనియాడారు. అటు పాక్ రక్షణ మంత్రి పర్వేజ్ ఖాతక్ కూడా ఖదీర్ మృతికి సంతాపం ప్రకటించారు. ముస్లిం మెజార్టీ దేశాలలో పాకిస్థాన్ను తొలి అణ్వాయుధ దేశంగా మార్చిన ఘనత అబ్దుల్ ఖదీర్దే. ఆయనకు పాకిస్థాన్ అత్యున్నత పౌర పురస్కారం ఇచ్చి సత్కరించింది.