వాషింగ్టన్, అక్టోబర్ 24: దట్టమైన మంచు, ముందు ఏముందో సరిగ్గా కనపడని పరిస్థితి. దీంతో ఒకటీ రెండు కాదు ఏకంగా 158 వాహనాలు ఒకదానిని మరొకటి ఢీకొన్నాయి. అమెరికాలోని లూసియానా రాష్ట్రం ఇంటర్ స్టేట్ 55 రహదారిపై ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మరణించగా, 25 మంది గాయపడ్డారు.
సోమవారం రాత్రి దట్టమైన మంచు కారణంగా పలు వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. అనంతరం మంటలు చెలరేగాయి. కొన్ని పై వంతెన నుంచి కింద నీటిలో పడ్డాయి. కార్లు, వాహనాలు తీవ్రంగా దెబ్బతిని నుజ్జునుజ్జయ్యాయి. ఏం జరుగుతుంతో తెలియక వాహనదారుల అరుపులు, కేకలతో భీతావహ వాతావరణం ఏర్పడింది. స్థానికంగా ఎండిన పొలాలను దహనం చేయడం వల్ల దట్టమైన పొగ కమ్ముకోవడం, దీనికి మంచు తోడవడంతో.. దారి కనబడక ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు.