ఇస్లామాబాద్: ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీని రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన భార్య బుష్రా బీబీ స్నేహితురాలు ఫరాహ్ ఖాన్పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ భార్యను అడ్డుపెట్టుకున్న ఫరాహ్ ఖాన్ భారీ అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇమ్రాన్ ఖాన్ రాజకీయ జీవితానికి చెక్ పడడంతో.. ఆయన భార్య స్నేహితురాలైన ఫరాహ్ దేశం విడిచి వెళ్లింది. దుబాయ్కు వెళ్తున్న సమయంలో ఆమె వద్ద ఉన్న బ్యాగ్పై అందరి కన్నుపడింది. ఆ బ్యాగ్ ధర సుమారు 90 వేల డాలర్లు ఉంటుందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. విమానంలో బ్యాగ్తో వెళ్తున్న ఫోటోలు వైరల్ కావడంతో.. ఫరాహ్ ఖాన్ బాగోతాలు మెల్లమెల్లగా బయటపడుతున్నాయి.
బుష్రా బీబీని అడ్డుకుపెట్టుకుని ఫరాహ్ ఖాన్ తతంగం నడిపిందని, ఆమె తీసుకువెళ్లిన బ్యాగ్ ఖరీదు 90వేల డాలర్లు అని పీఎంఎల్ నవాజ్ పార్టీ నేత కుర్షీద్ ఆలమ్ ట్వీట్ చేశారు. ప్రభుత్వ ఆఫీసర్ల బదిలీల కోసం వారి వద్ద నుంచి భారీ స్థాయిలో సొమ్ము వసూల్ చేసినట్లు ఫరాహ్పై ఆరోపణలు ఉన్నాయి. ఆ అవినీతి విలువ సుమారు ఆరు బిలియన్ల పాకిస్తానీ రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఇమ్రాన్ భార్య బుష్రా ఆదేశాల ప్రకారమే ఫరాహ్ ఖాన్ అవినీతికి పాల్పడినట్లు నవాజ్ పార్టీ నేత మరియం నవాజ్ ఆరోపించారు. ఇమ్రాన్ అధికారం కోల్పోయిన తర్వాత ఆయన చేసిన దోపిడీలను ప్రజల ముందు పెడుతామని ఆమె అన్నారు. ఇమ్రాన్ పదవి కోల్పోవడంతో.. ఆయనతో లింకు ఉన్న సన్నిహితులు ఇప్పుడు దేశం విడిచి వెళ్తున్నట్లు ఆరోపించారు.