వాషింగ్టన్: ఆమె పేరు ఫ్రాన్సిస్ హాగెన్. ఫేస్బుక్ మాజీ ఉద్యోగి. ఆ సంస్థ లొసుగుల్ని బయటపెట్టిన విజిల్బ్లోయర్. సీబీఎస్ అనే అమెరికా టీవీ చానెల్ ఇంటర్వ్యూలో ఫేస్బుక్పై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె ఇంటర్వ్యూ తర్వాత కొద్దిగంటలకే ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్తోపాటు దానికి చెందిన వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ కూడా పనిచేయడం మానేశాయి. విద్వేష ప్రసంగాలను ఫేస్బుక్ సొమ్ము చేసుకుని లాభాలు ఆర్జిస్తున్నదని ఇంటర్వ్యూలో హాగెన్ ఆరోపించారు. విద్వేషాన్ని రెచ్చగొట్టే, విభజనకు పురిగొల్పే కంటెంట్తో ప్రజల్లో ఆగ్రహావేశాలను కలిగించడం తేలికని ఫేస్బుక్ సొంత పరిశోధనలో తేలిందని ఆమె చెప్పారు. ‘వీటిని కట్టడి చేసేలా అల్గారిథమ్ను సురక్షితంగా మారిస్తే ప్రజలు ఫేస్బుక్లో గడిపే సమయం తగ్గిపోతుంది. అప్పుడు వారు క్లిక్ చేసే వాణిజ్య ప్రకటనలూ తగ్గిపోతాయి. తద్వారా ఆదాయం కోల్పోతామని ఫేస్బుక్ గుర్తించింద’ని ఆమె తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా విభజనను, తీవ్రవాదాన్ని, పోలరైజేషన్ను పెంచి పోషించేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసిందని ఆరోపించారు. నెల రోజుల కిందట సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్కు ఫేస్బుక్పై 8 ఫిర్యాదులు చేసినట్టు చెప్పారు.
విద్వేష ప్రసంగాలు, తప్పుడు సమాచారానికి ఫేస్బుక్ అడ్డుకట్ట వేయడం మానేసిందని గమనించిన హాగెన్ మేలో రాజీనామా చేశారు. దానికి ముందు వేలకొద్దీ పేజీల్లో ఉన్న సంస్థ అంతర్గత డాక్యుమెంట్లను ఆమె రహస్యంగా కాపీ చేశారు. విద్వేష ప్రసంగాల విషయంలో 3-5% మాత్రమే ఫేస్బుక్ చర్యలు తీసుకున్నట్టు ఆ డాక్యుమెంట్లు చెబుతున్నాయి. హేగన్ 2019లో ఫేస్బుక్లో చేరారు. అప్పుడు ఎన్నికల కోసం ఏర్పాటుచేసిన ‘సివిక్ ఇంటెగ్రిటీ’ బృందంలో ఆమె నియమితులయ్యారు. ఎన్నికల తర్వాత ఆ బృందాన్ని ఫేస్బుక్ రద్దు చేసింది. హాగెన్ను జర్నలిస్ట్ స్కాట్ పెల్లే ఇంటర్వ్యూ చేశారు. ‘ఇన్స్టాగ్రామ్ వల్ల ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన తీవ్రమవుతున్నదని 13.5 శాతం మంది బాలికలు తెలిపారు. అలాగే ఇన్స్టాగ్రామ్ వల్ల ఆహార అలవాట్లు అధ్వానంగా మారుతున్నాయని 17 శాతం మంది బాలికలు పేర్కొన్నార’ని ఫేస్బుక్ అంతర్గత నివేదికల్లోని ఓ అంశాన్ని స్కాట్ ప్రస్తావించారు.