భూగోళంపై నిత్యం ఏదో ఒక ప్రాంతంలో అంతుచిక్కని ఘటనలు జరుగుతూనే ఉంటాయి. అలాంటి ఓ ఘటనతో ఇప్పుడు చిలీ ప్రపంచ వార్తల్లో ప్రధానాంశంగా నిలిచింది. ఆ దేశంలోని టియెర్రా అమరిల్లా మున్సిపాలిటీ పరిధిలోని అల్కాపరోసా గని సమీపాన కొద్ది రోజుల క్రితం రాత్రికి రాత్రే ఓ భారీ నీటి గొయ్యి (సింక్హోల్) ఏర్పడటమే ఇందుకు కారణం.
దీనిపై ప్రపంచ వ్యాప్తంగా భూవిజ్ఞాన శాస్త్రవేత్తల్లో ఆసక్తి పెరుగుతున్నది. దాదాపు 656 అడుగుల లోతు, 82 అడుగుల చుట్టుకొలత కలిగిన ఈ గొయ్యి ఎలా ఏర్పడిందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. దీంతో అల్కాపరోసా అండర్గ్రౌండ్ గనిలో తాత్కాలికంగా మైనింగ్ను ఆపేశారు. ఈ సింక్హోల్ పరిమాణం మరింత పెరిగే అవకాశం ఉండటంతో అసలు ఇది ఎలా ఏర్పండిందన్న దానిపై చిలీ ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది.