కొలంబో: దేశాన్ని విడిచి పారిపోయిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్ష శుక్రవారం తిరిగి స్వదేశం చేరుకున్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఏడు వారాల క్రితం రాజపక్ష దేశం విడిచి వెళ్లారు. అయితే మళ్లీ స్వదేశానికి వచ్చిన సందర్భంగా ఆయనకు మంత్రులు, రాజకీయవేత్తలు ఎయిర్పోర్ట్ వద్ద స్వాగతం పలికినట్లు తెలుస్తోంది. విమానం నుంచి గోటబయ దిగగానే రాజకీయవేత్తలు పూలమాలలతో పరుగెత్తుకు వచ్చినట్లు ఓ ఎయిర్పోర్ట్ అధికారి తెలిపారు. జూలై నెలలో మిలిటరీ సహాయంతో రాజపక్ష దేశాన్ని విడిచి వెళ్లారు. ఆర్థిక సంక్షోభాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు భారీ సంఖ్యలో అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టిన విషయం తెలిసిందే. తొలుత సింగపూర్, ఆ తర్వాత థాయిలాండ్ వెళ్లిన గోటబయ తన రాజీనామా లేఖను పంపారు. 52 రోజుల పాటు దూరంగా ఉన్న గోటబయ బ్యాంగ్కాక్ నుంచి సింగపూర్ మీదుగా లంక చేరుకున్నారు. ఇన్నాళ్లూ ఆయన ఓ థాయిలాండ్ హోటల్లో ఉన్నారు.