బ్రసెల్స్: యురోపియన్ పార్లమెంట్ను ఉద్దేశించి యురోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్ లేయిన్ మాట్లాడారు. రష్యా ఆర్థిక వ్యవస్థ, మిలిటరీని టార్గెట్ చేస్తూ ఆరవ ప్యాకేజీకి చెందిన ఆంక్షలను ఆమె వెల్లడించారు. ప్రపంచ పటం నుంచి ఉక్రెయిన్ను తుడిచిపెట్టాలని పుతిన్ ఆకాంక్షిస్తున్నారని, కానీ ఈ ప్రయత్నంలో అతను సక్సెస్ కాలేరని, రష్యానే మునిగిపోతున్నట్లు ఆమె ఆరోపించారు. ఓ పద్ధతి ప్రకారం రష్యా ఇంధనాన్ని దశలవారీగా నిషేధిస్తామని ఆమె చెప్పారు. ప్రత్యామ్నాయ మార్గాలను భద్రపరుచుకున్న తర్వాత రష్యా చమురుపై సంపూర్ణ నిషేధం విధిస్తామన్నారు. ఈయూలోని హంగేరి, స్లోవేకియా దేశాలకు మినహాయింపు కల్పిస్తారా లేదా అన్న అంశంపై ఆమె స్పందించలేదు. రష్యాకు చెందిన క్రూడ్ ఆయిల్ని ఆరు నెలల్లోగా, రిఫైన్డ్ ఉత్పత్తుల్ని ఈ ఏడాది చివరిలోగా నిషేధిస్తామని వాండర్ చెప్పారు.
ఉక్రెయిన్కు అందిస్తున్న సాయం గురించి కూడా ఆమె వెల్లడించారు. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ గెలవాలన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఈ ఏడాది చివరిలోగా ఉక్రెయిన్ ఆర్థిక రాబడి 50 శాతం పడిపోనున్నట్లు వాండర్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే రష్యా ఇంధనంపై విధించిన ఆంక్షలను హంగేరి వ్యతిరేకిస్తోంది. రష్యాలోని సహజవాయువుకు సంబంధించిన అంశంలో ఈయూలోని 27 సభ్యదేశాలు మాత్రం ఇంకా స్పందించలేదు.