లండన్, మార్చి 19: యూకేలోని మొబైల్ ఫోన్లు అన్నింటికీ ఏప్రిల్ 23న సైరన్ లాంటి అలర్ట్ వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాల వంటి ప్రాణాంతక ప్రమాదాల నుంచి ప్రజలను రక్షించేందుకు ఉద్దేశించిన కొత్త ప్రజా హెచ్చరిక వ్యవస్థను పరీక్షించేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు బ్రిటన్ సర్కారు ఆదివారం వెల్లడించింది.
ఈ అప్రమత్తత వ్యవస్థను అరుదుగా మాత్రమే వాడతామని, భవిష్యత్తులో ఉగ్రవాదానికి సంబంధించిన అప్రమత్తత సందేశాలను కూడా ఈ వ్యవస్థలో చేరుస్తామని పేర్కొంది. మొబైల్ బ్రాడ్కాస్టింగ్ టెక్నాలజీతో సాయంతో రూపొందిస్తున్న ఈ ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ దేశ హెచ్చరిక, సమాచార సామర్థ్యాన్ని పెంపొందిస్తుందని క్యాబినెట్ కార్యాలయం తెలిపింది.