బాగ్దాద్: ఇరాక్లోని అమెరికా రాయబార కార్యాలయం లక్ష్యంగా క్షిపణి దాడులు జరిగాయి. కార్యాలయం కాంపౌండ్ లోపల సుమారు ఏడు మోర్టర్ రౌండ్లు పడ్డాయని అమెరికా మిలిటరీ అధికారులు వెల్లడించారు. ఇరాక్లో ఈ మధ్య కాలంలో అమెరికా రాయబార కార్యాలయం లక్ష్యంగా జరిగిన అతిపెద్ద దాడిగా ఈ క్షిపణి దాడిని అభివర్ణించారు.
అయితే ఈ దాడిలో ఎలాంటి మరణాలు సంభవించలేదని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అమెరికా మిలిటరీ అధికారులు ప్రకటించారు. కానీ, అమెరికా రాయబార కార్యాలయంతోపాటు ఇరాక్, సిరియాలోని అమెరికా బలగాలపై కూడా డ్రోన్లు, రాకెట్లతో దాడులు జరిగాయని తెలిపారు. హమాస్- ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో తాము ఇజ్రాయెల్కు మద్దతిస్తున్నందుకే ఈ దాడులు జరుగుతున్నాయని అమెరికా భావిస్తున్నది.
కాగా, ఇరాక్లో అమెరికా రాయబార కార్యాలయంపై దాడులకు ఇప్పటివరకు ఎవరూ బాధ్యత వహించలేదు. అయితే ఇరాక్, సిరియాలోని అమెరికా బలగాలే లక్ష్యంగా పలు దాడులు జరుగుతున్నాయి. ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్ పేరుతో ఇరాన్ అనుబంధ తీవ్రవాద సంస్థ ఈ దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తున్నది.