న్యూయార్క్, నవంబర్ 1: సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్ను కొనగోలు చేసిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. కంపెనీలో సమూల మార్పులు చేపడుతున్నారు. ఇప్పటికే సీఈవో పరాగ్ అగర్వాల్ సహా నలుగురు ఉన్నతస్థాయి ఉద్యోగులకు ఉద్వాసన పలికిన ఆయన.. తాజాగా బోర్డు సభ్యులందరిపై వేటు వేశారు. ఈ మేరకు సెక్యూరిటీ అండ్ ఎక్సేంజ్ కమిషన్కు సమర్పించిన ఫైలింగ్లో పేర్కొన్నారు. బోర్డులో తానొక్కడినే డైరెక్టర్ అని, అయితే ఇది తాత్కాలికమేనని వెల్లడించారు. బోర్డులో ఏకైక సభ్యుడిగా ఉన్న మస్క్.. సీఈవోగా కొనసాగనున్నట్టు సమాచారం.
మస్క్కు భారతీయుడి దిశానిర్దేశం
సోషల్మీడియా ఫ్లాట్ఫాం ట్విట్టర్ను సొంతం చేసుకొన్న తొలిరోజే ఇద్దరు టాప్ భారతీయ సంతతి ఉద్యోగులను గెంటేసిన కుబేరుడు ఎలాన్ మస్క్, ఆ సంస్థపై పట్టు సాధించేందుకు మళ్లీ ఓ భారతీయుడినే నమ్ముకొన్నారు. ట్విట్టర్లో మస్క్ ఆశించినట్టుగా సమూల మార్పులు చేసేందుకు చెన్నైలో పుట్టిపెరిగి అమెరికాలో స్థిరపడిన శ్రీరామ్ క్రిష్ణన్ అనే టెకీ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని శ్రీరామే స్వయంగా వెల్లడించారు. ‘ఎలాన్మస్క్కు మరికొందరు గొప్ప వ్యక్తులతో కలిసి నేను సహాయం చేస్తున్నాను. నాతోపాటు ఏ16జెడ్ కంపెనీలోని వ్యక్తులు చేస్తున్న పని ప్రపంచంపై గొప్ప ప్రభావం చూపనున్నదని భావిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. చెన్నైలో ఉన్నత విద్య అభ్యసించిన శ్రీరామ్, అమెరికాలోని ప్రఖ్యాత సిలికాన్ వ్యాలీలో ప్రముఖ వ్యక్తుల్లో ఒకరిగా ఎదిగారు. వెంచర్ క్యాపిటలిస్టుగా పేరు సంపాదించారు. మరికొందరితో కలిసి అడ్రీసన్ హోరోవిడ్జ్ అనే కంపెనీని నిర్వహిస్తున్నారు.