El Mencho : మెక్సికో (Mexico) లో మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా డాన్ (Drug Mafia Don) నెమెసియో రూబెన్ ఒసెగుయెరా (Nemesio Ruben Oseguera) అలియాస్ ‘ఎల్ మెంచో (El Mencho)’ హతమయ్యాడు. ఆదివారం జరిగిన ఆపరేషన్లో మెంచోను మట్టుబెట్టినట్లు మెక్సికో ఆర్మీ (Mexico Army) వెల్లడించింది. అయితే ఈ ఘటన మెక్సికో వ్యాప్తంగా హింసాత్మక ఘటనలకు తెరలేపింది. ఎల్ మెంచో అనుచరులు దేశంలోని పలు రాష్ట్రాల్లో హింసకు పాల్పడ్డారు. వాహనాలను, దుకాణ సముదాయాలను తగులబెట్టారు.
కాగా, 59 ఏళ్ల ఎల్ మెంచోను పట్టుకోవడం కోసం మెక్సికో సైన్యం ఆదివారం స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. అమెరికా నిఘావర్గాల సమాచారం మేరకు జాలిస్కో రాష్ట్రంలోని తపాల్ప పట్టణంలో అతడు దాగి ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టింది. ఈ క్రమంలో మెంచో అనుచరులు సైనికులపై కాల్పులకు పాల్పడ్డారు. దాంతో సైన్యం ఎదురుదాడి చేసింది. ఈ భీకర ఆపరేషన్లో మెంచో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని సైనికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ఈ విషయాన్ని మెక్సికో సైన్యం వెల్లడించింది.
మెక్సికో సైన్యం చేపట్టిన ఆపరేషన్లో ఎల్ మెంచోతోపాటు అతడి ముఠాకు చెందిన మరో ఆరుగురు కూడా మరణించినట్లు అధికారులు తెలిపారు. అయితే మెంచోను అంతం చేయడానికి ప్రతీకారంగా అతడి అనుచరులు మెక్సికోలోని పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. పలు ప్రాంతాల్లో వాహనాలను తగలబెట్టారు. రహదారులను దిగ్బంధించారు. సూపర్ మార్కెట్లు, బ్యాంకులకు నిప్పంటించారు. ఆందోళనలను అణిచివేసేందుకు సైన్యం బలగాలను భారీగా మోహరించింది. దాంతో మెక్సికోలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
కాగా, ఎల్ మెంచో 2009లో జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ (CJNG) అనే మాదకద్రవ్యాల ముఠాను స్థాపించాడు. దానిద్వారా దశాబ్ద కాలంలో మెక్సికోలోనే అత్యంత శక్తిమంతమైన నేర సిండికేట్గా మారాడు. అమెరికాకు ప్రధాన డ్రగ్స్ అక్రమ రవాణాదారుగా ఎదిగాడు. జాలిస్కో కార్టెల్ను అగ్రరాజ్యం ఉగ్ర సంస్థగా పరిగణించింది. మెంచో తలపై 15 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.136 కోట్లు) రివార్డు ప్రకటించింది. ఇదిలావుంటే ఎల్ మెంచోను అంతమొందించడంపై వైట్హౌస్ ప్రెస్ సెక్రెటరీ స్పందించారు.
ఎల్ మెంచోను పట్టుకోవడం కోసం మెక్సికో ప్రభుత్వానికి అమెరికా ఇంటెలిజెన్స్ సహకారం అందించిందని తెలిపారు. మెంచో తమ దేశానికి ఫెంటనిల్ను అక్రమంగా తరలిస్తున్నాడని, అలాంటి నార్కో టెర్రిరిస్ట్లను అగ్రరాజ్యం ఎన్నటికీ సహించబోదని వైట్హౌస్ ప్రెస్ సెక్రెటరీ తన ఎక్స్లో పోస్ట్ చేశారు. కాగా మెక్సికోలో అల్లర్ల నేపథ్యంలో అక్కడి భారత పౌరులకు మన ప్రభుత్వం అడ్వైజరీ జారీచేసింది. ప్రస్తుత హింసాత్మక పరిస్థితుల దృష్ట్యా మెక్సికోలోని భారత పౌరులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, సాయం కోసం ఎంబసీని సంప్రదించాలని సూచించింది.