పారిస్: ఉక్రెయిన్పై రష్యా దాడిని అమెరికాతోపాటు ఐరోపా యూనియన్ ఖండించింది. ఐరోపాలో బ్రిటన్ తర్వాత మరో ముఖ్య దేశమైన ఫ్రాన్స్, ఉక్రెయిన్కు తన సంఘీభావాన్ని వినూత్నంగా ప్రకటించింది. రాజధాని పారిస్లోని ప్రసిద్ధ ఈఫిల్ టవర్ ఉక్రెయిన్ జాతీయ జెండా రంగులతో కాంతులీనింది. ఉక్రెయిన్ ప్రజలకు సంఘీభావంగా నీలం, పసుపు రంగుల్లో ఈఫిల్ టవర్ వెలిగిపోయిందని పారిస్ మేయర్ అన్నే హిడాల్గో తెలిపారు. ఆ సమయంలో అక్కడున్న సందర్శకులు ఉక్రెయిన్ జాతీయ జెండా రంగుల్లో మెరిసిన ఈఫిల్ టవర్ను తిలకించి పులకించారు. ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
కాగా, ఉక్రెయిన్పై రష్యా దాడిని నివారించేందుకు తమ దేశంతోపాటు ఈయూ అన్ని ప్రయత్నాలు చేసిందని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్ తెలిపారు. ఉక్రెయిన్పై రష్యా దాడి ఐరోపా చరిత్రలో టర్నింగ్ పాయింట్ అని చెప్పారు. దీని వల్ల తమ దేశాలపై చాలా ప్రభావం ఉంటుందన్నారు. ఉక్రెయిన్పై దాడికి దిగిన రష్యాకు తాము చాలా కూల్గా బదులిస్తామని హెచ్చరించారు. రష్యాపై ఆంక్షలు విధించడంలో తాము ఏమాత్రం బలహీనులం కాదని స్పష్టం చేశారు.
మరోవైపు నాటోలో కీలక దేశమైన ఫ్రాన్స్, ఉక్రెయిన్కు ఆయుధాలను అందిస్తున్నట్లు శనివారం తెలిపింది. ఈ నేపథ్యంలో రష్యాకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్ వార్నింగ్ ఇచ్చారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పట్లో ముగియదన్నారు. చాలా సుదీర్ఘమైన యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు సిద్ధంగా ఉండాలన్నారు. ఆ దేశ వార్షిక వ్యవసాయ సదస్సులో పాల్గొన్న మాక్రన్ మాట్లాడుతూ… ‘ఈ సంక్షోభం చాలా రోజులు ఉంటుంది. ఈ యుద్ధం చాలా ఏళ్లు కొనసాగుతుంది. దాని వల్ల వచ్చే సంక్షోభ పర్యవసానాలను ఎదుర్కొనేందుకు మనమంతా సిద్ధంగా ఉండాలి’ అని అన్నారు.