జెరూసలేం: ఇజ్రాయెల్ దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న గాజాకు ఊరట కలిగించేందుకు ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలు వారం రోజులకు పైగా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. గాజా వాసుల కోసం సహాయ సామగ్రిని తీసుకొచ్చిన ట్రక్కులను ఇజ్రాయెల్ అనుమతించింది. దాంతో యుద్ధం మొదలైన రెండు వారాల తర్వాత గాజా తలుపులు తెరుచుకున్నాయి.
ఆహారం, నీరు, ఇంధన కొరతతో అల్లాడుతున్న గాజా ప్రజల కోసం రఫా బార్డర్ పాయింట్ను ఈజిప్టు ఓపెన్ చేసింది. దాంతో నిత్యావసరాలు, మందులతో కూడిన మానవతా సాయంతో వచ్చిన ట్రక్కులు బార్డర్ దాటాయి. ఇరవై ట్రక్కులు గాజాలోకి ఎంటరవుతున్న వీడియోలను ఈజిప్ట్ ప్రభుత్వం టీవీలో ప్రసారం చేసింది.
గాజాకు సంబంధించి ఇజ్రాయెల్ అధీనంలో లేని ఏకైక దారి రఫా మాత్రమే. ఈజిప్టు సరిహద్దుల్లో ఉన్న ఈ దారి నుంచి ట్రక్కులు వచ్చేందుకు తొలుత ఇజ్రాయెల్ అంగీకరించలేదు. దాంతో కొన్ని రోజులుగా మానవతా సాయాన్ని తీసుకొస్తున్న కార్గో విమానాలు, ట్రక్కులు రఫా బార్డర్ వద్దే ఆగిపోయాయి. అమెరికా విజ్ఞప్తి నేపథ్యంలో కేవలం 20 ట్రక్కుల ప్రవేశానికి ఇజ్రాయెల్ఓకే చెప్పింది.
గాజాలో ఎంటరైన 20 ట్రక్కుల్లోని సామగ్రిని చిన్న చిన్న మోటార్లపై అవసరమైన ప్రాంతాలకు తరలిస్తున్నారు. కాగా, వందలాది ట్రక్కు లు సహాయ సామగ్రితో వారం రోజులకుపైగా ఈజిప్టు సరిహద్దుల వద్ద వేచి చూస్తున్నాయి. అందులో 20 ట్రక్కులను ఇప్పుడు లోపలికి అనుమతించారు. దాంతో గాజా వాసులకు స్వల్ప ఊరట లభించింది. ఇప్పటిదాకా తినేందుకు తిండి, తాగేందుకు నీరు లేక సుమారు 23 లక్షల మంది గాజావాసులు అల్లాడుతున్నారు.