లండన్: గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి శుభవార్త. గుండె పనితీరు ఎలా ఉందో తెలుసుకునేందుకు ఇకపై దవాఖానల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే మీ ఈసీజీని చెక్ చేసుకోవచ్చు. ఆ రిపోర్టును డాక్టర్లకు పంపి సలహాలు అడగొచ్చు. స్మార్ట్ఫోన్ సాయంతో పనిచేసే ‘కార్డియా మొబైల్’ అనే చిన్న పరికరంతో ఇంట్లోనే ఈసీజీ తీసుకోవచ్చని పరిశోధకులు తెలిపారు. వైద్య పరికరాలు తయారుచేసే కంపెనీ అలివ్కోర్ ఈ పరికరాన్ని అభివృద్ధిపరిచింది. ఖరీదు దాదాపు రూ.10 వేలు ఉంటుందని అంచనా. బ్రిటన్లోని నేషనల్ హెల్త్ సర్వీస్ ఈ డివైజ్కు అనుమతులు కూడా ఇచ్చింది.
ఈ చిన్న పరికరంపై రెండు ఎలక్ట్రోడ్లు ఉంటాయి. ఒక్కో ఎలక్ట్రోడ్పై ఒక్కో చేతి రెండు వేళ్లు 30 సెకండ్ల పాటు ఉంచితే చాలు.. స్మార్ట్ఫోన్లోని యాప్లో మీ ఈసీజీ రికార్డవుతుంది. గుండెలో ఏట్రియల్ ఫిబ్రిలేషన్ (క్రమరాహిత్యంగా గుండె కొట్టుకోవడం) సమస్యతో బాధపడే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.