ఐస్క్రీం ఎలా ఉంటుంది? చల్లాగానే కదా.. కానీ అలా తనకు వచ్చిన ఐస్క్రీం చల్లగా ఉందని రిఫండ్ కోరాడట ఓ కస్టమర్. దీంతో ఈ ఆర్డర్ పంపిన ఈటరీ యజమానికి దిమ్మతిరిగిపోయింది. ఈ ఘటన యూకేలో వెలుగు చూసింది. ఇక్కడ జస్ట్ఈట్ అనే యాప్ ఉంది. మనకు జొమాటో, స్విగ్గీలా యూకేలో ఇది ఉందన్నమాట.
దీనిలో ఓల్ధామ్ ప్రాంతంలో ఉన్న లక్కీస్ అనే ఈటరీ నుంచి కూడా ఆర్డర్లు ఇవ్వొచ్చు. దీని యజమాని పేరు హసన్ హబీబ్. అతను తనకు ఎదురైన అనుభవాలను వెల్లడించాడు. కొన్నిరోజుల క్రితం వరకూ జస్ట్ ఈట్ కంపెనీ బాగానే ఉండేదని, కానీ ఇటీవల ఈ కంపెనీ తమ పాలసీలో మార్పులు చేసిందని హసన్ తెలిపాడు.
దీంతో అంతకుముందు ఎవరైన ఆ కస్టమర్ తనకు వచ్చిన డెలివరీ బాగలేదని రిఫండ్ కోరితే.. జస్ట్ ఈట్ నుంచి రెస్టారెంట్ యజమానులకు ఫోన్ వచ్చేదని వివరించాడు. వీరి మధ్య చర్చల అనంతరం రిఫండ్పై నిర్ణయం తీసుకునేవారు. కానీ కొత్త పాలసీ ప్రకారం ఇదేమీ ఉండదు. 30 రోజుల్లోగా రిఫండ్ డబ్బు కట్టేయాలి.
ఈ పాలసీ తీసుకొచ్చిన తర్వాత తనకు చాలా రిఫండ్ రిక్వెస్ట్లు వస్తుండటంతో విసుగెత్తిందని హసన్ అన్నాడు. అసలు కారణాలేంటా? అని చూస్తే ఐస్క్రీం, మిల్క్షేక్ చల్లగా ఉన్నాయని కొందరు రిఫండ్ కోరినట్లు తెలిసిందన్నాడు. ఈ కారణాలు చూసిన తర్వాత ఇదంతా ఎవరో మోసగాళ్లు చేస్తున్నట్లు తనకు అర్ధమైందని, జస్ట్ ఈట్ కొత్త పాలసీని ఇలా వాడుకుంటున్నారని తెలిపాడు.
దీంతో జస్ట్ ఈట్ను వాడటం తాను తగ్గించేశానని చెప్పాడు. అయితే తాము రెస్టారెంట్లకు ఎప్పుడూ అండగా ఉంటామని, ఏదైనా మోసం జరిగినట్లు తెలిస్తే.. రెస్టారెంటు యజమానులకు వెంటనే డబ్బు తిరిగి వచ్చేలా చర్యలు తీసుకుంటామని జస్ట్ ఈట్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు.