డమాస్కస్: పదిరోజుల క్రితం ప్రకృతి సృష్టించిన తీవ్ర నష్టం నుంచి ఇంకా కోలుకోని సిరియాలో మరోసారి భూకంపం వచ్చింది. గురువారం రాత్రి 10.47 గంటలకు ఇడ్లిబ్ ప్రావిన్స్లో భూమి కంపించింది. దీని తీవ్రత 5.4గా నమోదయిందని సిరియా జాతీయ భూకంప కేంద్రం వెల్లడించింది. దీనిప్రభావంతో రాజధాని డమాస్కస్, ఉత్తర ప్రావిన్స్ అలెప్పోలో కూడా ప్రకంపణలు చోటుచేసుకున్నాయని తెలిపింది. భూఅంతర్భాగం 18.8 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని వెల్లడించింది. ఇడ్లిబ్ నగరానికి 61 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని పేర్కొన్నది
30 నిమిషాల వ్యవధిలోనే వాయువ్య తీర ప్రావిన్స్ అయిన లటాకియాలో కూడా భూమి కంపించిందని వెల్లడించింది. రాత్రి 11:17 గంటలకు 3.4 తీవ్రతతో భూకంపం వచ్చిందని తెలిపింది. లటాకియాకు 50 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్ర ఉందని, 46 కిలోమీటర్ల లోతులో భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయని చెప్పింది.
కాగా, ఈనెల 6న టర్కీ, సిరియాలో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ప్రకృతి ప్రకోపానికి ఇప్పటివరకు 41 వేల 732 మంది మరణించారు. ఇందులో టర్కీలోనే 38,044 మంది ఉండగా, సిరియాలో 3688 మంది ఉన్నారు. అయితే సిరియా ప్రధాన భూభాగంలో 1414 మంది మంది మరణించారని, మరో 2357 మంది గాయపడ్డారని ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది.