టోక్యో, ఆగస్టు 22: పెందలాడె భోజనం చేయడం ఆరోగ్యానికి మంచిదని పెద్దలంటారు. అది నిజమేననని శాస్త్రీయపరంగా కూడా రుజువైంది. రాత్రి భోజనాన్ని తొమ్మిది గంటల ప్రాంతంలో చేసేవారితో పోలిస్తే, సాయంత్రం ఆరు గంటలకు చేసేవారిలో ఆరోగ్య సమస్యలు తక్కువగా నమోదవుతున్నట్టు జపాన్లోని యూనివర్సిటీ ఆఫ్ కుమామోటో పరిశోధకులు తెలిపారు. ఆలస్యంగా రాత్రి భోజనాన్ని చేసేవారితో పోలిస్తే త్వరగా భోజనాన్ని చేసే వారి రక్తంలోని చక్కెర స్థాయిలు సమతుల్యతతో ఉన్నాయని, జీవక్రియ, ఎసిడిటీ, బీపీ, ఆయాసం, నిద్రలేమి వంటి సమస్యలు కూడా కనిపించలేదని పరిశోధకులు తెలిపారు. డజను మంది వలంటీర్లపై మూడు రోజుల పాటు ఈ అధ్యయనాన్ని నిర్వహించినట్టు పేర్కొన్నారు. పగటిపూటతో పోలిస్తే నిద్రపోయే సమయంలో శరీరం తక్కువ శ్రమకు గురవుతుందని, తొందరగా రాత్రి భోజనం చేయడం వల్ల నిద్రపోయే సమయంలోపు ఆ ఆహారం జీర్ణం అవుతుందని.. ఇది శరీర జీర్ణక్రియకు మంచిదన్నారు. తదుపరి ఉదయపు అల్పాహారం తీసుకునే సమయానికి ఇది సరైన అంతరంగా మారుతుందని పేర్కొన్నారు. ఆలస్యంగా తిని, ఆ వెంటనే నిద్రపోవడంతో జీర్ణక్రియ ప్రక్రియలో కొంత ఇబ్బందులు ఎదురవ్వొచ్చని తెలిపారు. ఈ వివరాలు ‘న్యూట్రియెంట్స్’ జర్నల్లో ప్రచురితమయ్యాయి.