దుబాయ్: క్లౌడ్ సీడింగ్ (మేఘ మధనం) గురించి వినే ఉంటారు కదా. అప్పుడెప్పుడో మన తెలుగు రాష్ట్రాల్లోనూ కరువు సమయంలో ఇలా కృత్రిమ వర్షాలు కురిపించే ప్రయత్నం చేశారు. కానీ ఎడారి దేశమైనా వినూత్న ఆవిష్కరణలకు ఎప్పుడూ ముందుండే యూఏఈ ఓ కొత్త టెక్నాలజీని ఉపయోగించి కృత్రిమ వర్షం కురిపించింది. దేశంలో ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. 50 డిగ్రీల సెంటిగ్రేడ్ను కూడా తాకుతున్నాయి. దీంతో ఎండ వేడిమి నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు దుబాయ్ ఓ వినూత్న ప్రయత్నం చేసింది.
డ్రోన్ల సాయంతో..
ఈ కొత్త టెక్నాలజీలో భాగంగా డ్రోన్ల సాయంతో మేఘాలకు షాకిచ్చి కృత్రిమ వర్షం కురిపించింది అక్కడి ప్రభుత్వం. దుబాయ్లోని ఓ హైవేపై ఇలా వర్షం కురుస్తున్న వీడియో వైరల్గా మారింది. కొన్నేళ్లుగా ఎయిర్క్రాఫ్ట్ను పంపించి క్లౌడ్ సీడింగ్ ద్వారానే యూఏఈ కృత్రిమ వర్షాలు కురిపిస్తోంది. అయితే ఈ తాజా వర్షాలు మాత్రం డ్రోన్ల సాయంతో సాధ్యమైనట్లు తెలుస్తోంది. అక్కడి వాతావరణ శాఖ దీనిపై స్పష్టత ఇవ్వకపోయినా.. ఈ ఏడాదే తన కొత్త టెక్నాలజీని పరిశీలిస్తామని యూఏఈ గతంలో చెప్పింది.
ఎలా పని చేస్తుంది?
ఈ డ్రోన్లకు యూఏఈ నిధులు ఇచ్చినా.. వీటిని అభివృద్ధి చేసింది మాత్రం యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్ శాస్త్రవేత్తలు. ఈ డ్రోన్లు మేఘాల్లోకి విద్యుత్తును పంపిస్తాయి. అది కాస్తా మేఘాల్లో ఎలక్ట్రికల్ బ్యాలెన్స్ను మార్చి వర్షం కురిపిస్తాయి. మేఘాల్లోని వర్ష బిందువులను చార్జ్ చేయడానికి తాము ఇలా డ్రోన్లను పంపిస్తున్నట్లు ఈ ప్రాజెక్ట్పై పని చేసిన శాస్త్రవేత్త డాక్టర్ కెరి నికోల్ చెప్పారు. ఈ కొత్త టెక్నాలజీ యూఏఈలో వర్షపాతాన్ని పెంచుతుందని భావిస్తున్నారు.