కీవ్: ఉక్రెయిన్లోని జపొరిజ్జియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్(Zaporizhzhia power plant)పై ఇటీవల డ్రోన్ అటాక్ జరిగింది. ఆ ఘటన పట్ల ఐక్యరాజ్యసమితి అటామిక్ వాచ్డాగ్ ఆందోళన వ్యక్తం చేసింది. పెను అణు ప్రమాదం జరిగే అవకాశం ఉన్నట్లు యూఎన్ పేర్కొన్నది. ఆ డ్రోన్ దాడి వెనుక ఉక్రెయిన్ హస్తం ఉన్నట్లు రష్యా తెలిపింది. డ్రోన్ దాడిలో సుమారు ముగ్గురు గాయపడ్డారు. కానీ ఉక్రెయిన్ మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నది.
ఆరు అణు రియాక్టర్లు ఉన్న ఆ ప్లాంట్ ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో కీలకంగా మారింది. డ్రోన్ దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ పేర్కొన్నది. చాలా నిర్లక్ష్యంగా డ్రోన్ అటాక్ చేసినట్లు ఐఏఈఏ అధిపతి రాఫేల్ గ్రోసి తెలిపారు. న్యూక్లియర్ ప్లాంట్ వద్ద ప్రస్తుతం భద్రతాపరమైన సమస్యలు ఉత్పన్నం అవుతున్నట్లు ఆయన వెల్లడించారు.
దక్షిణ ఉక్రెయిన్లో ఉన్న జపొరిజ్జియా ప్లాంట్.. యూరోప్లోనే పెద్దది. అయితే యుద్ధం మొదలైన తర్వాత దాన్ని రష్యా దళాలు ఆక్రమించేశాయి. 2022 ఫిబ్రవరి నుంచి ఆ ప్లాంట్ రష్యా ఆధీనంలోనే ఉన్నది. జపొరిజ్జియా వద్ద డ్రోన్ దాడి వల్ల స్వల్పంగా భౌతిక నష్టం జరిగినట్లు ఐఏఈఏ నిపుణులు వెల్లడించారు. ఓ రియాక్టర్ కూడా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ప్లాంట్ వద్ద రేడియేషన్ లెవల్స్ నార్మల్గా ఉన్నాయని, ఎటువంటి సీరియస్ డ్యామేజ్ జరగలేదని ప్లాంట్ సిబ్బంది చెబుతున్నారు.