మియామి: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump)పై నేరాభియోగం నమోదు అయ్యింది. అక్రమరీతిలో రహస్య డాక్యుమెంట్లను కలిగి ఉన్న కేసులో ఆయనపై అభియోగం మోపారు. గత ఆగస్టులో ఆ దేశానికి చెందిన న్యాయశాఖ .. మాజీ అధ్యక్షుడి ఇంట్లో సోదాలు చేసి దాదాపు 11 వేల డాక్యుమెంట్లను సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆ సీజ్ చేసిన పత్రాల్లో దాదాపు వంద వరకు క్లాసిఫైడ్ కాగా, మరికొన్ని టాప్ సీక్రెట్ పత్రాలు ఉన్నాయి.
అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలిగిన తర్వాత క్లాసిఫైడ్ డాక్యుమెంట్లను ఇంట్లో పెట్టుకోవడం చట్టరీత్యా నేరం. ఆ డాక్యుమెంట్లలో ఎటువంటి సమాచారం ఉన్నా.. భద్రత లేని ప్రదేశాల్లో ఆ డాక్యుమెంట్లు ఉండరాదు. జాక్ స్మిత్ నేతృత్వంలోని బృందం ఈ కేసును విచారించింది. మొత్తం ఏడు అభియోగాలను ట్రంప్పై నమోదు చేశారు.
న్యాయాన్ని అడ్డుకోవడం, కుట్ర, అక్రమరీతిలో క్లాసిఫైడ్ సమాచారాన్ని దగ్గర పెట్టుకోవడం లాంటి నేరాభియోగాలు ట్రంప్పై నమోదు అయ్యాయి. మంగళవారం రోజున మియామి కోర్టులో ట్రంప్ హాజరుకావాల్సి ఉంది. అయితే ఆ కేసులో ట్రంప్ హాజరుకానున్నట్లు ఆయన తరపున న్యాయవాది వెల్లడించారు.
తనపై నేరాభియోగం మోపినట్లు ట్రంప్ తనకు చెందిన ట్రుత్ సోషల్ అనే సోషల్ మీడియాలో ప్రకటించారు. నాలుగు నిమిషాల వీడియోను ట్రంప్ పోస్టు చేశారు. తనను తాను డిఫెండ్ చేసుకున్నారు. అమాయకుడిని అని ఆయన ఆ వీడియో చెప్పుకున్నారు. న్యూజెర్సీలో ఆ వీడియోను రికార్డు చేశారు.