హైదరాబాద్: ఇటీవల సౌర తుఫాన్లు(Solar Storms) బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. భానుడి ధాటికి ధరిత్రి మండిపోతోంది. అయితే 2025లో ఆ భగభగలు మరింత తీవ్రంగా ఉండనున్నట్లు వాషింగ్టన్ పోస్టు ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ వేడిని తట్టుకునే రీతిలో నేటి డిజిటల్ సమాజం లేదని ఓ కథనంలో పేర్కొన్నారు. ఇంటర్నెట్ యుగాంతం అయ్యే అవకాశాలు దగ్గరైనట్లు తాజాగా సోషల్ మీడియా యూజర్లు ట్రోల్ చేస్తున్నారు. కానీ 2025లో వచ్చే సౌర తుఫాన్ల వల్ల ఇంటర్నెట్కు సమస్య వాటిల్లే అవకాశాల గురించి మాత్రం నాసా ఎటువంటి ప్రకటన చేయలేదు.
సౌర తుఫాన్లు తీవ్రంగా ఉంటే ఎలా ఉంటుందన్న పరిస్థితిని ఇప్పటి వరకు ఎదుర్కోలేదని, ప్రస్తుతం ఉన్న మౌళికసదుపాయాలు ఏమౌతాయో చెప్పలేమని, ఆ ప్రభావాన్ని అంచనా చేయలేమని కాలిఫోర్నియా వర్సిటీ కంప్యూటర్ ప్రొఫెసర్ సంగీత అబూ జ్యోతి తెలిపారు. సోలార్ సూపర్స్టార్మ్స్.. ప్లానింగ్ ఫర్ ఆన్ ఇంటర్నెట్ అపోకలిప్స్ అన్న టైటిల్తో జ్యోతి రాసిన రిపోర్టు ఇప్పుడు చర్చనీయాంశమైంది.
తీవ్రమైన సౌర తుఫాన్ల వల్ల సముద్రగర్భంలో ఉన్న కమ్యూనికేషన్ కేబల్స్ కూడా దెబ్బతిననున్నట్లు ఆమె చెప్పారు. కొన్ని నెలల పాటు సూర్యుడు తన ప్రతాపాన్ని చూపే అవకాశాలు ఉన్నాయని, ప్రతి రోజు కనీసం 11 బిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లే ఛాన్సు ఉందన్నారు.