న్యూయార్క్: అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. పెన్సిల్వేనియాలో రసవత్తరంగా సాగిన సేనేట్ పోటీలో డెమోక్రటిక్ అభ్యర్థి జాన్ ఫెట్టర్మ్యాన్ నెగ్గారు. ఈ విక్టరీతో కాంగ్రెస్ ఎగుమ సభ సేనేట్లో బైడెన్ పార్టీకి ఆధిపత్యం పెరిగినట్లు అవుతుంది. దీంతో మరో రెండేళ్ల పాటు సేనేట్లో ఆ పార్టీ హవా కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
నిజానికి పెన్సిల్వేనియా సీటుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. రిపబ్లికన్ అభ్యర్థి మెహమెట్ ఓజ్ గెలుస్తారని అందరూ ఆశించారు. చివరి వరకు ఈ రేసు థ్రిల్లర్ను తలపించింది. డెమోక్రాట్లు ఈ సీటుపై ఏమాత్రం నమ్మకం పెట్టుకోలేదు. ఫెట్టర్మ్యాన్ విజయంతో డెమోక్రాట్లు కూడా స్టన్ అవుతున్నట్లు తెలుస్తోంది.
హౌజ్ స్పీకర్ నాన్సీ పెలోసీ మరోసారి ఎన్నికయ్యారు. ఆమె గెలవడం వరుసగా ఇది 19వ సారి. అయితే ఒకవేళ హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో రిపబ్లికన్లు ఆధిక్యం సాధిస్తే, అప్పుడు ఆమె హౌజ్ స్పీకర్ పదవిని కోల్పోయే అవకాశం ఉంటుంది.